బాలికపై అత్యాచారం.. చికిత్స పొందుతూ మృతి

by  |
బాలికపై అత్యాచారం.. చికిత్స పొందుతూ మృతి
X

దిశ ప్రతినిధి , హైదరాబాద్: తల్లిదండ్రులు లేని బాలికను అక్కున చేర్చుకుని విద్యాబుద్ధులు చెప్పించి యోగ్యురాలుగా తీర్చి దిద్ద వలసిన ఓ అనాథాశ్రమం నిర్వాహకుల వక్రబుద్ధి బాలిక మృతికి కారణమైంది. అనాథాశ్రమం నిర్వాహకులు డబ్బులకు కక్కుర్తి పడి సదరు బాలికను మనిషి రూపంలో ఉన్న మానవ మృగానికి అప్పగించడంతో అతని చేతిలో నెలల తరబడి లైంగిక దాడికి గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారు జామున అనంత లోకాలకు వెళ్లిపోయింది. అత్యంత జుగుప్సా కరమైన ఈ సంఘటన నగరంలో చేటుచేసుకోగా ‘‘ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ’’ చొరవతో వెలుగు చూసింది. నగరానికి చెందిన 14 యేండ్ల మైనర్ బాలిక ఏంజిలా (పేరు మార్చాం) కు చిన్నతనంలోనే తండ్రి చనిపోయాడు. కొంత కాలం తర్వాత తల్లి కూడా మృతి చెందింది.

దీంతో షాపూర్ లో నివాసముండే పినతల్లి ఆ బాలికను చేరదీసి 2015 లో అమీన్ పూర్ లోని ‘‘ మారుతీ ఆర్ఫనేజ్’’ హోం లో చేర్పించారు. అక్కడ అనాథాశ్రమం నిర్వాహకురాలు విజయ ఆమెకు వరుసకు సోదరుడయ్యే జయదీప్ లు కొన్ని రోజులపాటు బాగానే ఉన్నా తర్వాత వారిలో వక్రబుద్ధి మొదలైంది. వారికి బాగా పరిచయం ఉన్న వేణుగోపాల్ (50) తరచుగా అక్కడికి వచ్చేవాడు. ఈ నేపథ్యంలో అతని కన్ను బాలిక మీద పడింది. దీనికి నిర్వాహకురాలు కూడా అడ్డు చెప్పకుండా డబ్బులు తీసుకుని అతనికి సహకరించింది. అనాథాశ్రమానికి వేణుగోపాల్ రాగానే బాలికను భవనం ఐదవ అంతస్థులోకి పంపి తలుపులు వేసేది. గదిలోకి బాలిక వెళ్లగానే వేణుగోపాల్ కూల్ డ్రింక్ లో మత్తుమందు ఇచ్చి మత్తులోకి జారుకోగానే లైంగిక దాడికి పాల్పడేవాడు. ఇలా కొన్ని నెలల పాటు జరగడంతో సదరు బాలిక తీవ్ర అనారోగ్యానికి గురైంది.

ఈ నేపథ్యంలో మార్చి 21న కరోనా లాక్ డౌన్ కు ముందు షాపూర్ కు చెందిన బాలిక పినతల్లి ఆమెను తన ఇంటికి తీసుకువెళ్లింది. అక్కడకు వెళ్లిన తర్వాత బాలిక ఆనారోగ్యానికి గురైంది. పక్కలో మూత్రం పోసేది. తీవ్ర అనారోగ్యానికి గురైన బాలికను అక్కున చేర్చకునేది పోయి వారు కూడా చీత్కరించుకున్నారు. ఇలా నాలుగు నెలలు అక్కడ ఉన్న తర్వాత బాలికను బోయిన్ పల్లిలోని పెద్దమ్మ ఇంటికి తీసుకువెళ్లారు. అక్కడికి వెళ్ళిన అనంతరం బాలిక ఆరోగ్యం దిగజారుతుండడం, ఇది తెలుసుకుని బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ప్రతినిధులు ఆరా తీయగా అసలు విషయం బయట పడింది. దీంతో గత నెల 31వ తేదీన బోయిన్ పల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో అక్కడ జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు అనంతరం కేసును అమీన్ పూర్ పోలీస్ స్టేషన్ కు బదిలీ చేశారు. అక్కడ కేసును విచారించిన పోలీసులు వేణుగోపాల్ తో పాటు అనాథాశ్రమం నిర్వాహకురాలు విజయ, జయదీప్ లను నాలుగు రోజుల క్రితం అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. బాలికను నింబోలి అడ్డాలోని హోంకు తరలించారు.

నిలోఫర్ ఆస్పత్రిలో మృతి….

లైంగిక దాడికి గురైన బాలిక యోగక్షేమాలు తెలుసుకోవడానికి ‘‘ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ’’ సభ్యురాలు అపర్ణా గిరిధర్ మరో సభ్యురాలు రాగజ్యోతి తో కలిసి నింబోలి అడ్డాలోని హోం కు చేరుకుని బాలికతో తరచుగా మాట్లాడారు . దైర్యంగా ఉండమని, నిందితులపై కఠిన చర్యలు ఉంటాయని దైర్యం చెప్పారు. ఏ అవసరం ఉన్నా మేమున్నమని భరోసా ఇచ్చారు. ఐతే దురదృష్టవ శాత్తు బాలిక ఆరోగ్యం మరింత క్షీణించడంతో హోం నిర్వాహకులు రోజుల క్రితం బాలికను నిలోఫర్ ఆస్పత్రికి వైద్య చికిత్సల నిమిత్తం తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న మైనర్ బాలిక బుధవారం తెల్లవారు జామున పరిస్థితి విషమించి మృతి చెందింది.

బెయిలు రాకుండా చర్యలు : అపర్ణా గిరిధర్, మెంబర్, బాలల హక్కుల పరిరక్షణ కమిషన్

బాలికపై లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తితో పాటు అతనికి సహకరించిన హోం నిర్వాహకులకు కఠిన శిక్షలు పడేందుకు కమిషన్ చర్యలు తీసుకుంటుంది. ఈ మేరకు సంగారెడ్డి జిల్లా జడ్జితో పాటు ఎస్పీకి కూడా ఫోన్ లో మాట్లాడడం జరిగింది. నిందితులకు కఠిన శిక్షలు విధిచాలని సూచించాం. వారికి బెయిలు తీసుకోవడానికి న్యాయవాదులు ముందుకు రావద్దని కోరుతున్నాం, తద్వారా నిందితులకు కఠిన శిక్షలు పడే వీలుంటుంది. భవిష్యత్ లో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా అనాథాశ్రమాలను తరచుగా విజిట్ చేయాలని బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ నిర్ణయం తీసుకుంది.

Next Story

Most Viewed