సీఎం సారూ.. తలంబ్రాలు పట్టుకొని రండి

by  |
Rani Rudrama
X

దిశ, భద్రాచలం: ముఖ్యమంత్రిగా ఎవరున్నా రాష్ట్ర ప్రభుత్వం తరఫునన భద్రాద్రి శ్రీసీతారామచంద్రస్వామివారి కల్యాణ‌ మహోత్సవానికి తలంబ్రాలు, పట్టువస్త్రాలు తీసుకొని రావడం అనాదిగా వస్తున్న ఆచారమని, కానీ కేసీఆర్ సీఎం అయ్యాక ఆ సంప్రదాయం పక్కదారి పట్టిందని పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి, యువ తెలంగాణ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రాణిరుద్రమ ఆరోపించారు. భద్రాచలం పట్టణంలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె మీడియాతో మాట్లాడారు. సీఎం రాకుండా బంధువులతో పట్టువస్త్రాలు పంపించడంతో ఆచారం అమలుగాక శ్రీరామ భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయని వివరించారు. భద్రాద్రి ఆలయ అభివృద్ధికి వంద కోట్లు ప్రకటించి వెళ్ళిన తర్వాత సీఎం కేసీఆర్ మళ్ళీ ఇక్కడకు రాలేదని గుర్తుచేశారు. ఈసారి స్వామివారి కల్యాణానికి వచ్చి, ఇచ్చిన హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు.

ఆలయానికి చెందిన సుమారు 1100 ఎకరాల భూమి ఆంధ్రలో కలిపిన ఐదు పంచాయతీల్లో ఉందని, ముంపులేని ఆ ఐదు గ్రామ పంచాయతీలను తిరిగి భద్రాచలంలోకి తీసుకు రావడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నాయని ఆరోపించారు. సమస్యలపై అవగాహన, పరిష్కరించే సత్తా కలిగిన అభ్యర్థులకు పట్డభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేయాలని, తనను గెలిపిస్తే ప్రజల గొంతుకగా శాసనమండలిలో గళం వినిపిస్తానని ఆమె స్పష్టం చేశారు. సమావేశంలో యువ తెలంగాణ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జిట్టా బాలకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed