భాగ్యనగరంలో కనపడని రంజాన్ సందడి

by  |
భాగ్యనగరంలో కనపడని రంజాన్ సందడి
X

దిశ, హైదరాబాద్: చారిత్రక హైదరాబాద్ నగరంలో ఈసారి రంజాన్ పండగ కళ తప్పింది. రంజాన్ మాసం ప్రారంభం, పండగ అయిపోయాక కూడా పదిరోజుల పాటు సందడిగా ఉండే భాగ్యనగరంలో ఎలాంటి కోలాహలం కనిపించలేదు. మక్కా మసీదు, చార్మినార్, మీరాలం, మాదన్నపేట ఈద్గాలతో పాటు, నగరంలోని మసీదుల్లో ముస్లిం సోదరులు వైభవంగా జరుపుకోవాల్సిన పండగా లాక్‌డౌన్‌ కారణంగా ఎవరూ ఊహించని విధంగా నిర్వహించుకోవాల్సి వచ్చింది. వందేళ్ల క్రితం (1908) మూసీ నదికి భారీగా వరదలు వచ్చిన సమయంలో పాతబస్తీ తీవ్రంగా దెబ్బతినడంతో కూడా రంజాన్ పండగ ఇదే విధంగా జరిగి మక్కా మసీదు, చార్మినార్ ప్రాంతాలు నిర్మానుష్యంగా మారినట్లు ముస్లిం పెద్దలు చెబుతున్నారు.

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రభుత్వం లాక్‌డౌన్ విధించి ఆలయాలు, మసీదుల్లో ప్రార్థనలకు అనుమతులు ఇవ్వలేదు. ఇవాళ రంజాన్ పండగ అయినప్పటికీ ముస్లిం సోదరులు మక్కా మసీదులో ప్రార్థనలు చేయలేకపోయారు. మత పెద్దలకు మాత్రమే ప్రార్థనా మందిరాల్లోకి అనుమతి ఉండగా, మిగతా వారంతా ఇళ్లలోనే ఉండి ప్రార్థనలు చేసుకున్నారు. చిన్నపిల్లలు, యువకులు మక్కా మసీదు, చార్మినార్ ప్రాంతాల్లో రోడ్డుపైకి వచ్చి శుభాకాంక్షలు చెప్పుకున్నారు. పోలీసులు గట్టి బందోబస్తు చర్యలు చేపట్టారు. నగర జాయింట్ సీపీ చౌహాన్ చార్మినార్ ఈ ప్రాంతాన్ని సందర్శించారు.



Next Story

Most Viewed