కుర్చీ పదిలం.. విశ్వాసం నెగ్గిన గెహ్లాట్

by  |
కుర్చీ పదిలం.. విశ్వాసం నెగ్గిన గెహ్లాట్
X

జైపూర్: ఊహించినట్టుగానే రాజస్తాన్ అసెంబ్లీలో అశోక్ గెహ్లాట్ సర్కారు విశ్వాస పరీక్షలో నెగ్గింది. ఇందులో కాంగ్రెస్ ప్రభుత్వం సునాయసంగా గెలుపొందింది. సుమారు 125 మంది చట్టసభ్యులు అశోక్ గెహ్లాట్ సర్కారుకు ముజువాణి ద్వారా మద్దతు పలికారు. ఈ ప్రక్రియ అనంతరం అసెంబ్లీ సమావేశాలను ఈ నెల 21వ తేదీకి స్పీకర్ సీపీ జోషి వాయిదా వేశారు. దాదాపు నెల రోజులపాటు సాగిన తిరుగుబాటు, బుజ్జగింపులు, ఫిరాయింపులు, ప్రలోభాల వాదనలకు తెరపడింది. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్, ప్రియాంకల జోక్యంతో తిరుగుబాటు విరమించుకున్న సచిన్ పైలట్ రాజస్తాన్ చేరుకుని అశోక్ గెహ్లాట్‌తో చేతులు కలిపారు.

అసెంబ్లీ వ్యవహారాల మంత్రి శాంతి కుమార్ దరివాల్ విశ్వాస పరీక్ష తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా అధికార, ప్రతిపక్షాల మధ్య వాడివేడిగా విమర్శలు ప్రతివిమర్శలు, వాదోపవాదాలు జరిగాయి. కాంగ్రెస్ అంతర్గత కలహాలు కళ్ల ముందే కనిపించినా బీజేపీ పై నిందలు వేశారని, సర్కారు ఫోన్ ట్యాపింగులకు పాల్పడిందని, రాష్ట్ర పోలీసులను సొంత పనులకు వాడుకున్నారని ప్రతిపక్ష ఆరోపణలు సంధించింది. కాగా, షా వచ్చినా, తానాషా వచ్చిన తమ సర్కారును కూల్చలేరని అధికారపక్షం వాదించింది.

అసెంబ్లీ సమావేశానికి ముందు రాజస్తాన్ ప్రజలే గెలుస్తారని ట్వీట్ చేసిన సీఎం విశ్వాస పరీక్ష నెగ్గిన అనంతరం ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రలు చేసినవారందరికీ గుణపాఠమని, వారి కుతంత్రాలన్నీ విఫలమయ్యాయని పేర్కొన్నారు. మధ్యప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, గోవా, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్‌లలో చేసిన కుయుక్తులనే రాజస్తాన్‌లోనూ అమలు చేశారని, కానీ, ఇక్కడ వారి కుట్రలు పారలేదని తెలిపారు.

కాగా, మాజీ డిప్యూటీ సీఎం స్పందిస్తూ, రాజస్తాన్ సర్కారు మంచి మెజార్టీతో విశ్వాసాన్ని నెగ్గిందని, ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా ఫలితం సర్కారుకు సానుకూలంగానే వచ్చిందని అన్నారు. ఈ ఫలితంలో తమపై వస్తున్న వదంతులకు ఫుల్‌స్టాప్ పడుతుందని ఆశించారు. దాదాపు నెలరోజులపాటు తిరుగుబాటు బాట పట్టిన మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్, కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాలతో చర్చించి, సయోధ్య కుదిరిన తర్వాత అశోక్ గెహ్లాట్‌తో చేతులు కలిపిన సంగతి తెలిసిందే.

బలవంతులే బార్డర్‌కెళ్తారు : సచిన్ చమత్కారం

అసెంబ్లీలో డిప్యూటీ సీఎం నుంచి తొలగించిన సచిన్ పైలట్ కుర్చీ మారింది. రెండో వరుసలో ప్రతిపక్షాలకు సమీపంగా కేటాయించారు. ఈ సీటుపై బీజేపీ నేతలు కామెంట్లు చేశారు. దీనిపై స్పందిస్తూ తన సీటు మార్పుపై ఆశ్చర్యం చెందారని, ప్రభుత్వ బెంచీల పక్కన ఉన్నప్పుడు సురక్షిత భావన ఉండేదని సచిన్ అన్నారు. ఇప్పుడు తాను ప్రతిపక్షాల పక్కన కూర్చున్నారని, పూర్తిగా సరిహద్దుకు వచ్చి చేరారని తెలిసిందని అన్నారు. బలవంతులే బార్డర్‌కు వెళ్తారన్న విషయం గుర్తుకొచ్చిందని సచిన్ చమత్కరించారు.

Next Story