రోజుకు 300 శ్రామిక్ రైళ్లు.. దేనికి సంకేతం?

by  |
రోజుకు 300 శ్రామిక్ రైళ్లు.. దేనికి సంకేతం?
X

న్యూఢిల్లీ: పొరుగు రాష్ట్రాల్లో చిక్కుకున్న వలస కార్మికులను స్వస్థలాలకు తరలించేందుకు నడుపుతున్న శ్రామిక్ రైళ్ల సంఖ్యను భారీగా పెంచుతూ రైల్వేశాఖ ఆదివారం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధాని ఆదేశాల మేరకు ఇకనుంచి రోజుకు 300 శ్రామిక్ రైళ్లను నడిపేందుకు సిద్ధమవుతున్నామని రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. అంతేకాకుండా వచ్చే మూడు నుంచి నాలుగు రోజుల్లో వలస కార్మికులందరూ తమతమ స్వరాష్ట్రాలకు చేరుకునేలా ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించారు.

ఇదిలా ఉండగా, మే 1నుంచి ఇప్పటివరకు 366 శ్రామిక్ రైళ్లను నడపగా, 4లక్షల మందికిపైగా వలస కార్మికులను స్వరాష్ట్రాలకు చేర్చినట్టు రైల్వేశాఖ వెల్లడించింది. ప్రతి శ్రామిక్ రైలులో 24 భోగీలుండగా, ఒక్కో కోచ్‌లో 72 సీట్ల సామర్థ్యం ఉంది. సామాజిక దూరం పాటించడంలో భాగంగా ఒక్కో భోగీలో 54మందిని మాత్రమే అనుమతించగా, రైలు మొత్తంలో 12వందల మందిని తరలిస్తున్నారు. తాజా నిర్ణయం ప్రకారం.. నాలుగు రోజుల్లో 12వందల రైళ్లను నడిపి, సుమారు 15.55లక్షల మంది వలస కార్మికులను స్వరాష్ట్రాలకు చేర్చనుంది.

కాగా, సరిగ్గా వారం రోజుల్లో లాక్‌డౌన్ గడువు ముగియనుండగా, నాలుగు రోజుల్లో వలస కార్మికులందరినీ స్వరాష్ట్రాలకు చేరవేయాలని చెబుతుండటం, విదేశాల్లో చిక్కుకున్న భారతీయుల కోసం ఆపరేషన్ సముద్ర సేతు, వందే భారత్‌లను విస్తృతంగా చేపడుతుండటం వంటివి గమనించినవారిలో లాక్‌డౌన్ పొడిగిస్తారనే ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి.

Next Story

Most Viewed