పేదల జేబుల్లోకి నేరుగా డబ్బులు చేరాలి

by  |
పేదల జేబుల్లోకి నేరుగా డబ్బులు చేరాలి
X

దిశ, వెబ్ డెస్క్: ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించిన రూ.20లక్షల కోట్ల ప్యాకేజీపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందించారు. శనివారం మధ్యాహ్నం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ దేశం మొత్తం వలస కార్మికులకు మద్దతుగా నిలవాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. లక్షల మంది వలస కూలీలు కాలినడకన సొంతూళ్లకు వెళ్తూ మార్గమధ్యలో ఆహారం, మంచినీళ్ల కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, భావి భారత చిన్నారులు సైతం రోడ్లపై నడుస్తున్న పరిస్థితులు కనపడుతున్నాయన్నారు. ఈ పరిస్థితుల్లో ప్రజలకు కావల్సింది రాజకీయ ప్రకటనలు కాదని, పేద ప్రజల జేబుల్లోకి నేరుగా డబ్బులు వెళ్లేలా చూడాలని పేర్కొన్నారు.

ప్రభుత్వం చిన్నవ్యాపారులను ఆదుకుంటూ, గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పని దినాలను 200 రోజులు నిర్వహించాలని స్పష్టం చేశారు. పేద ప్రజల జేబుల్లో డబ్బులు లేకుంటే ఏమీ కొనుక్కోలేరని, వారికి నేరుగా సాయం అందితేనే కొంతమేర బాధలను తీర్చవచ్చన్నారు. కరోనా కంటే ఆర్థిక నష్టం తీవ్రంగా ఉంటుందని, దీన్ని అన్ని రాష్ట్రాల భాగస్వామ్యంతో పరిష్కరించాలని సూచించారు. భారత నిర్మాణంలో కార్మికుల పాత్ర కీలకమని, ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంటూనే లాక్‌డౌన్‌ ఎత్తివేతకు చర్యలు తీసుకోవాలని కోరారు.


Next Story