రైతులకు పరిహారం ఇవ్వండి.. లోక్‌సభలో వారి పేర్లను ప్రదర్శించిన రాహుల్ గాంధీ

by  |
rahugandi
X

న్యూఢిల్లీ: నిరసనల్లో చనిపోయిన రైతు కుటుంబాలకు పరిహారం చెల్లించాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. మంగళవారం శీతాకాల సమావేశంలో పార్లమెంటు వేదికగా ఆయన కేంద్రాన్ని కోరారు. ‘రైతులకు హక్కులు కల్పించాలని నేను కోరుకుంటున్నాను. వారికి పరిహారంతో పాటు ఉద్యోగాలు కూడా అందించాలి’ అని అన్నారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా నిరసనలు చేస్తూ చనిపోయిన వారి సమాచారం లేదన్న కేంద్రం వాదనలను ఆయన ఖండించారు. నిరసనల సమయంలో 700కు పైగా రైతులు చనిపోయిన ఒక్కరి గురించి కూడా సమాచారం లేకపోవడం ఏంటని ప్రశ్నించారు.

పంజాబ్‌లో తమ ప్రభుత్వం రైతు కుటుంబాలకు పరిహారంతో పాటు ఉద్యోగాలు ఇస్తుందని తెలిపారు. వారి పూర్తి సమాచారాన్ని లోక్‌సభ వేదికగా ప్రదర్శించారు. ‘రైతు ఆందోళనలో 700 మందికి పైగా చనిపోయారు. ప్రధానమంత్రి సాగు చట్టాల విషయంలో క్షమాపణ కోరారు. తన తప్పును అంగీకరించారు. అయితే తర్వాత కేంద్ర వ్యవసాయ మంత్రి చనిపోయిన రైతుల వివరాలు లేవని వెల్లడించారు’ అని తెలిపారు. పంజాబ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం మరణించిన కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారంతో పాటు ఉద్యోగాలు ఇస్తున్న విషయాన్ని నొక్కి చెప్పారు. దీంతో హరియాణా రైతుల సమాచారాన్ని కూడా ప్రదర్శించారు.



Next Story

Most Viewed