‘ఆ ధరను తొలగించడమే కేంద్రం లక్ష్యం’

by  |
Rahul Gandhi
X

న్యూఢిల్లీ: సాగుకు మూడు స్తంభాలుగా పేరున్న కనీస మద్దతు ధర, పంట కొనుగోలు, వ్యవసాయ మార్కెట్లను కేంద్ర ప్రభుత్వం నాశనం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నదని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. కొత్తగా రూపొందించిన సాగు చట్టాలతో కర్షకులు సంతోషంగా ఉంటే నిరసనలు ఎందుకు చేస్తున్నట్టు అని ప్రశ్నించారు.

మంచి బిల్లులే అయితే కరోనా కాలంలోనూ హడావిడిగా వీటిని ఆమోదించుకోవాల్సిన అవసరమేందని అడిగారు. అంబానీ, అదానీల చేతుల్లో కేంద్ర ప్రభుత్వం కీలు బొమ్మ అని విమర్శించారు. లోక్‌సభ, రాజ్యసభలలో చర్చ ఎందుకు పెట్టలేదని నిలదీశారు. రాహుల్ గాంధీ ఆదివారం పంజాబ్‌లోని లూధియానాలో సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్‌తో ట్రాక్టర్ ర్యాలీలో పాల్గొన్నారు. మోగా జిల్లా బదని కాలన్‌లో ఆయన రైతులనుద్దేశించి ప్రసంగించారు.

రైతులకు చివరిదాకా అండగా ఉంటామని రాహుల్ భరోసానిచ్చారు. ‘మేం మీతో ఉన్నాం. ఒక్కడుగూ వెనక్కి వేయం. రైతుల వెన్ను విరవాలని కేంద్రం చూస్తున్నది. కానీ, అది ఎట్టిపరిస్థితుల్లోనూ సాధ్యపడనివ్వం. ఇప్పుడున్న వ్యవస్థలో లోపాలు లేవని చెప్పడం లేదు. అంతమాత్రానా వ్యవస్థనే నాశనం చేయాలనుకోవడం సరికాదు. వ్యవస్థను మరింత మెరుగుదిద్దాలి. కేంద్ర తీసుకొచ్చిన చట్టాలతో రైతులు దినదిన గండంగా జీవించాల్సి వస్తుంది’ అని అన్నారు. ‘కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ నల్ల చట్టాలను తీసి చెత్త కుండీలో తప్పకుండా పడేస్తుందని హామీ ఇస్తున్నాను. కనీస మద్దతు ధర, పంట సేకరణ వ్యవస్థను నాశనంచేయాలనే సర్కారు లక్షించింది.

పెట్టుబడుదారులు నడిపిస్తున్నారు: సిద్దూ

విఫలమైన అమెరికా వ్యవస్థను ఇక్కడ అమలు చేయాలని కేంద్రం యోచిస్తున్నదని, మన దేశాన్నీ పెట్టుబడిదారులే నడిపిస్తున్నారని పంజాబ్ ఎమ్మెల్యే నవజోత్ సింగ్ సిద్దూ మోడీ సర్కారుపై విమర్శలు కురిపించారు. రైతుల లాభాలను సబ్సిడీలుగా, సంపన్నులకిచ్చే లక్షల రూపాయల మినహాయింపులు ప్రోత్సాహకాలుగా చిత్రిస్తున్నారని అన్నారు. కేంద్రం సమాఖ్య వ్యవస్థపై దాడి చేస్తున్నదని మండిపడ్డారు.

Next Story

Most Viewed