శ్రీలంక పర్యటనలో ద్రవిడే కోచ్: జై షా

by  |
శ్రీలంక పర్యటనలో ద్రవిడే కోచ్: జై షా
X

దిశ, స్పోర్ట్స్: శ్రీలంక పర్యటనకు వెళ్లనున్న భారత పరిమిత ఓవర్ల జట్టుకు నేషనల్ క్రికెట్ ఆకాడమీ (ఎన్ఏసీ) డైరెక్టర్ రాహుల్ ద్రవిడ్ కోచ్‌గా వ్యవహరిస్తాడని బీసీసీఐ కార్యదర్శి జై షా స్పష్టం చేశారు. ద్రవిడ్‌తో పాటు టి. దిలీప్, పరాస్ మహంబ్రే టీమ్ ఇండియాతో కలసి కొలంబో వెళ్తారని ఆయన చెప్పారు. ఇప్పటికే టీమ్ ఇండియా పరిమిత ఓవర్ల జట్టు ముంబైలోని హోటల్‌లో క్వారంటైన్‌లో ఉన్నది. ఈ నెల 28 వరకు అక్కడే క్వారంటైన్ పూర్తి చేసుకొని అనంతరం కొలంబో బయలుదేరి వెళ్లనున్నది. అక్కడి ప్రేమదాస స్టేడియంలో శ్రీలంక జట్టుతో మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌లు ఆడనున్నది.

టీమ్ ఇండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి, బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్, బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ ప్రస్తుతం ఇంగ్లాండ్‌లో టెస్టు జట్టుతో ఉన్నారు. దీంతో రాహుల్ ద్రవిడ్‌ను జట్టుతో పాటు పంపుతున్నామని జైషా చెప్పారు. ఇదే విషయాన్ని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కూడా ధృవీకరించారు. టీమ్ ఇండియాకు 2014లో రాహుల్ ద్రవిడ్ బ్యాటింగ్ కన్సల్టెంట్‌గా పని చేశారు. అనంతరం టీమ్ ఇండియా ఏ, అండర్ 19 జట్లకు కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తించాడు.



Next Story