లోక్‌సభలో రఘురామ వర్సెస్ మిథున్ రెడ్డి.. ఢీ అంటే ఢీ

by  |
లోక్‌సభలో రఘురామ వర్సెస్ మిథున్ రెడ్డి.. ఢీ అంటే ఢీ
X

దిశ, ఏపీ బ్యూరో: లోక్‌సభలో నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు, వైసీపీ లోక్‌సభాపక్ష నేత మిథున్‌రెడ్డిల మధ్య మాటల యుద్ధం నెలకొంది. లోక్‌సభ సమావేశాల్లో సోమవారం జీరో అవర్‌లో రైతుల మహాపాదయాత్రకు పోలీసుల అడ్డంకులు కల్పించడాన్ని ఎంపీ రఘురామ తప్పుబట్టారు. గాంధేయ పద్ధతిలో రైతులు చేస్తున్న మహాపాదయాత్రను అడ్డుకోవడం అన్యాయమన్నారు. హైకోర్టు నుంచి అనుమతులు ఉన్నా పోలీసులు అడ్డుకోవడం దురదృష్టకరమన్నారు. రైతులు రాజధాని కోసం 33 వేల ఎకరాలు స్వచ్ఛందంగా ఇచ్చారని గుర్తు చేశారు.

భూములు ఇచ్చిన రైతులు గాంధేయ మార్గంలో జరుపుతున్న మహాపాదయాత్రకు పోలీసులు తీవ్రమైన అడ్డంకులు సృష్టించడమే కాకుండా రైతులను తీవ్రంగా హింసిస్తున్నారని ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఆరోపించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని.. ప్రజల ప్రాధమిక హక్కులను కూడా పోలీసులు హరిస్తున్నారంటూ ఎంపీ రఘురామ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అయితే రఘురామ ప్రసంగాన్ని వైసీపీ ఎంపీలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఎంపీ రఘురామ వ్యాఖ్యలపై వైసీపీ లోక్‌సభా పక్ష నేత మిథున్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సీబీఐ కేసుల నుంచి బయటపడేందుకు ఎంపీ రఘురామ అధికార బీజేపీలో చేరేందుకు తహతహలాడుతున్నారంటూ విమర్శించారు. ఎంపీ రఘురామపై ఉన్న సీబీఐ కేసులపై వేగంగా దర్యాప్తు నిర్వహించాలని మిథున్ రెడ్డి లోక్‌సభలో డిమాండ్ చేశారు.

Next Story

Most Viewed