విశాఖ ఏజెన్సీ టూ జహీరాబాద్.. గంజాయి రవాణా

by  |
విశాఖ ఏజెన్సీ టూ జహీరాబాద్.. గంజాయి రవాణా
X

దిశ, క్రైమ్ బ్యూరో: విశాఖ ఏజెన్సీ నుంచి తెలంగాణలోని జహీరాబాద్‌‌తో పాటు మహారాష్ట్ర బోర్డర్ ప్రాంతాలకు అక్రమంగా గంజాయి విక్రయించే ముఠాను రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. విశాఖ నుంచి జహీరాబాద్‌కు వస్తుండగా మార్గమధ్యలో పెద్ద అంబర్ పేట క్రాస్ రోడ్ వద్ద రాచకొండ స్పెషల్ ఆపరేషన్ టీమ్(ఎస్ఓటీ) పోలీసులు, హయత్ నగర్ పోలీసులు సంయుక్తంగా పట్టుకున్నారు. ఈ సందర్భంగా రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ విలేకరులతో మాట్లాడుతూ… విశాఖకు చెందిన పాతాల నాగేష్ గంజాయి వ్యాపారం చేస్తున్నాడు. తనకు సన్నిహితంగా ఉండే మరో 7గురి మిత్రులతో కలిసి గంజాయిని విశాఖ ఏజెన్సీ నుంచి తక్కువ ధరకు గంజాయిని కొనుగోలు చేసి తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో విక్రయించడంతో అధిక లాభాలు పొందవచ్చని భావించాడు. ఈ ప్రకారమే విశాఖ ఏజెన్సీలో గంజాయిని కేజీ రూ.3000 లకు మాత్రమే కొనుగోలు చేసి జహీరాబాద్, ఇతర పరిసర ప్రాంతాలలో మాత్రం కేజీ గంజాయిని రూ.10 వేలకు విక్రయించేవాడు.

అందుకు జహీరాబాద్ పట్టణానికి చెందిన కార్తీక్ రాథోడ్‌తో అంగీకార ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ క్రమంలో పాతాల నాగేష్ గతేడాది గంజాయి తరలిస్తుండగా జహీరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పట్నుంచి జహీరాబాద్ పోలీసులకు వాంటెడ్ (క్రైమ్ నెంబరు 100/2020)గా ఉన్నాడు. ఇదిలా ఉండగా, మరోసారి గంజాయిని కొనుగోలు చేసి హైచర్ వాహనంలో జహీరాబాద్ తరలించేందుకు యత్నించిన పాతాల నాగేష్ ముఠాను ఎల్‌బీనగర్ సమీపంలోని పెద్దఅంబర్‌పేట క్రాస్ రోడ్డు వద్దకు రాగానే రాచకొండ ఎస్ఓటీ, హయత్ నగర్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా వీరి నుంచి హైచర్ వాహనంలో 300 ప్యాకెట్ లలో సుమారు 650 కేజీల గంజాయితో పాటు ఎస్కార్ట్ గా వచ్చిన మారుతి ఎర్జిగ వాహనాన్ని, రూ.60 వేల నగదు, 10 మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

పీడీ యాక్ట్ నమోదు..

రాచకొండ కమిషనరేట్ పరిధిలో గతేడాది (2020) 2200 కేజీల గంజాయి పట్టుబడినట్టు సీపీ మహేష్ భగవత్ తెలిపారు. ఈ సందర్భంగా 15 మందిపై పీడీ యాక్ట్ నమోదు చేశామన్నారు. ఈ కేసులో మొత్తం 9 మంది నిందితులు కాగా, జహీరాబాద్ కు చెందిన కార్తీక్ రాథోడ్ పరారీలో ఉన్నట్టు తెలిపారు. ప్రస్తుతం 8 మందిని అరెస్టు చేసి రిమాండ్ తరలిస్తామన్నారు. వీరిపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామన్నారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టులో త్వరగా ట్రయల్ కు వచ్చేలా ప్రయత్నం చేస్తామన్నారు. అంతే కాకుండా, జహీరాబాద్ కార్తీక్ రాథోడ్ ను త్వరలోనే పట్టుకుని పీడీ నమోదు చేస్తామన్నారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed