సిద్ధిపేటలో యూరియా కోసం బారులు

by  |
సిద్ధిపేటలో యూరియా కోసం బారులు
X

దిశ, దుబ్బాక: ఆరుగాలం కష్టపడే రైతులకు కష్టాలు తప్పడం లేదు. ప్రకృతి సహకరించిన అధికారుల నిర్లక్ష్యంతో ఎరువులు అందక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పంటలకు సరిపడా యూరియా దొరకక రోజుల తరబడి పడిగాపులు కాయాల్సి వస్తుందంటూ రైతులు ఆవేదన వ్య క్తం చేస్తున్నారు.

సిద్ధిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఎదుట రైతులు యూరియా కోసం బారులు తీరారు. గత వారం రోజుల నుండి యూరియా రాక ఎదురుచూస్తున్న రైతులకు యూరియా లారీ మిరుదొడ్డికి వచ్చిందని తెలియడంతో, ఒక్కసారిగా పెద్ద ఎత్తున పీఎసీఎస్ వద్దకు రైతులు చేరుకున్నారు. పంటలకు సరిపడా యూరియా రాకపోవడంతో రైతులు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్కో రైతుకు రెండు లేదా మూడు యూరియా బస్తాలు మాత్రమే ఇవ్వడంతో పంటలకు ఎలా వేసేది అంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

రైతుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం కపట ప్రేమ చూపుతుందని బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు మల్లేశం మండిపడ్డారు. మండలానికి కొండంత యూరియా అవసరం ఉంటే గోరంత యూరియాను పంపిణీ చేసి రాష్ట్ర ప్రభుత్వం చేతులు దులుపుకుంటోందని ఆరోపించారు. మిరుదొడ్డి మండలానికి మరో 300 టన్నుల యూరియా అవసరం ఉందని పీఏసీఎస్ సిబ్బంది రాజు తెలిపారు. యూరియా వచ్చిన వెంటనే రైతులకు అందజేస్తామని తెలిపారు.



Next Story

Most Viewed