అలెక్సా ద్వారా ఎలిజబెత్ రాణి క్రిస్మస్ సందేశం

by  |
అలెక్సా ద్వారా ఎలిజబెత్ రాణి క్రిస్మస్ సందేశం
X

దిశ, వెబ్‌డెస్క్: టెక్నాలజీ రోజురోజుకీ ఎదుగుతోందంటే ఏమో అనుకున్నాం గానీ.. ప్రస్తుతం ఉన్న టెక్నాలజీ మనం అనుకున్నదాని కంటే ఎక్కువ అవసరాలను తీరుస్తోంది. ప్రతి ఏడాది క్రిస్మస్ రోజున కామన్వెల్త్ దేశాలను ఉద్దేశించి క్వీన్ ఎలిజబెత్ ప్రసంగిస్తారు. అయితే ఇప్పుడు కొత్తగా కరోనా వైరస్ వేరియంట్ వచ్చిన కారణంగా యునైటెడ్ కింగ్‌డమ్‌లో కఠినమైన లాక్‌డౌన్ విధించారు. దీంతో ఈ క్రిస్మస్‌కు క్వీన్ ఎలిజబెత్ సందేశాన్ని చేరవేయడానికి టెక్నాలజీ సహాయపడుతోంది. అందుకు అమెజాన్ అలెక్సా సాయం చేస్తోంది. గ్రీనిచ్ సమయం ప్రకారం డిసెంబర్ 25, మధ్యాహ్నం 3 గంటల నుంచి ‘అలెక్సా.. ప్లే ద క్వీన్స్ క్రిస్మస్ డే మెసేజ్’ అని అలెక్సాను అడిగితే ఈ ఏడాది ఎలిజబెత్ రాణి సందేశాన్ని వినవచ్చు.

మరి ఈసారి ఎలిజబెత్ రాణి సందేశంలో ఏమేం అంశాలు ఉంటాయనే దాని గురించి ఇప్పుడు కామన్వెల్త్ దేశాల్లో చర్చ జరుగుతోంది. తప్పనిసరిగా కొవిడ్‌కు సంబంధించి అన్ని దేశాలను ఏకం చేసే స్ఫూర్తిదాయక మాటలు ఉంటాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి కష్టకాలంలో కామన్వెల్త్ దేశాలకు ఎలిజబెత్ రాణి మాటలు తప్పకుండా ధైర్యాన్నిచ్చే అవకాశం ఉంది. కాగా 1952 నుంచి ఇప్పటివరకు మహారాణి క్రిస్మస్ సందేశాలను రాయల్ హౌస్‌హౌల్డ్ వెబ్‌సైట్‌లో చూడవచ్చు. అయితే ఇలా క్రిస్మస్ సందేశాలను అమెజాన్ ప్రసారం చేయడం ఇదేమీ మొదటిసారి కాదు. 2012లో ఒకసారి రాణి క్రిస్మస్ సందేశాన్ని అమెజాన్ తమ కిండిల్ యాప్‌లో విడుదల చేసింది. అయితే ఈసారి పూర్తిగా ఆమె మాటల్లోనే వినేలా అలెక్సాను అనుసంధానించినట్లు అలెక్సా యూరప్ డైరెక్టర్ ఎరిక్ కింగ్ తెలిపారు.



Next Story

Most Viewed