సింధు, సైనాలకు క్లిష్టమైన డ్రా

by  |
సింధు, సైనాలకు క్లిష్టమైన డ్రా
X

యోనెక్స్ ఇండియా ఓపెన్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో భారత స్టార్ షట్లర్లు పీవీ సింధు, సైనా నెహ్వాల్‌కు క్లిష్టమైన డ్రా ఎదురైంది. ఈ నెల 24 నుంచి ఇండియా ఓపెన్ ప్రారంభం కానుండగా, దేశంలో కరోనా వైరస్ కల్లోలం కారణంగా ఈ టోర్నీ ఆదరణపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

2017 ఇండియా ఓపెన్ విజేత అయిన పీవీ సింధు తొలి రౌండ్‌లోనే హాంకాంగ్‌కు చెందిన ‘చూంగ్ నాన్ ఈ’తో తలపడనుండగా.. క్వార్టర్ ఫైనల్స్‌లో కెనడాకు చెందిన ఏడో సీడ్ ‘మిషెల్లీ లీ’ ఎదురయ్యే అవకాశం ఉంది. ఇక, మరో మాజీ విజేత సైనా నెహ్వాల్ తొలి రౌండ్‌లో చైనీస్ తైపీకి చెందిన ‘పైయూ పో’తో తలపడే అవకాశం ఉంది. అలాగే రెండో రౌండ్‌లో కొరియాకు చెందిన సంగ్ జీ హ్యున్‌తో తలపడవచ్చు. ఈ టోర్నీలో రాణించడం ద్వారా ఒలంపిక్స్ బెర్త్ ఖాయం చేసుకోవాలని సైనా భావిస్తోంది. ఇక పురుషుల విభాగంలో ఐదో సీడ్ కిదాంబి శ్రీకాంత్ టోక్యో ఒలంపిక్స్‌కు అర్హత సాధించాలంటే ఏప్రిల్ 28లోగా టాప్ 16 ఉండాలి. దీంతో ఈ టోర్నీ అతడికి కీలకంగా మారింది. మూడో సీడ్ సాయి ప్రణీత్ కూడా ఒలంపిక్స్ బెర్త్‌పై కన్నేశాడు.

కాగా, దేశంలో కరోనా వైరస్ విస్తృతంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో టోర్నీ జరిగే అవకాశాలపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కొరియా నుంచి వచ్చే వ్యక్తులకు 14 రోజుల క్వారెంటైన్ పీరియడ్ అవసరమని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో అక్కడ నుంచి వచ్చే క్రీడాకారులు రెండు వారాలపాటు వైద్యుల పర్యవేక్షణలో ఉండాలి. దీంతో ఎంత మంది క్రీడాకారులు ఈ టోర్నీలో పాల్గొంటారనే విషయంపై స్పష్టత లేదు.


Next Story

Most Viewed