ఆఫీసర్లను జైళ్లో పెడితే ఢిల్లీకి ఆక్సిజన్ వస్తుందా..?

by  |
ఆఫీసర్లను జైళ్లో పెడితే ఢిల్లీకి ఆక్సిజన్ వస్తుందా..?
X

న్యూఢిల్లీ : ప్రభుత్వ అధికారులను జైలులో పెట్టినంత మాత్రాన ఢిల్లీలో ఆక్సిజన్ కొరత తీరదని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. కొవిడ్ విజృంభిస్తున్న తరుణంలో దేశ రాజధానికి ఆక్సిజన్ అందించకపోవడంపై మంగళవారం ఢిల్లీ హైకోర్టు సుప్రీంకోర్టును చీవాట్లు పెట్టిన విషయం తెలిసిందే. తాము పదే పదే చెబుతున్నా ఢిల్లీకి ఆక్సిజన్ ఎందుకు సప్లై చేయడం లేదని, కేంద్రంపై కోర్టు ధిక్కరణ ఎందుకు పెట్టకూడదంటూ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదే విషయమై తమ అధికారులు కోర్టు ఎదుట ప్రతిరోజు హాజరుకాకుండా మినహాయింపునివ్వాలని కోరుతూ కేంద్రం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా స్పందిస్తూ.. అధికారులను జైళ్లో వేస్తే ఢిల్లీకి ఆక్సిజన్ రాదని, నగర అవసరాలను తీర్చడానికి కేంద్ర కృషి చేస్తున్నదని వ్యాఖ్యానించారు. కాగా.. 700 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్‌ను ఢిల్లీకి సరఫరా చేయాలని జస్టిస్ డి.వై. చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశించింది. గడిచిన మూడు రోజులుగా ఢిల్లీకి ఎంత ఆక్సిజన్ సరఫరా చేసిందన్నదానిపై తమకు నివేదిక ఇవ్వాలని కేంద్రాన్ని కోరింది. ఢిల్లీ అధికారులు బృహన్ ముంబయి కార్పొరేషన్ అధికారులను చూసి నేర్చుకోవాలని సూచించింది.

Next Story

Most Viewed