TRS ఎమ్మెల్యేకు నిరసన సెగ.. కాన్వాయ్‌ను అడ్డుకున్న నిరసనకారులు

by  |
TRS ఎమ్మెల్యేకు నిరసన సెగ.. కాన్వాయ్‌ను అడ్డుకున్న నిరసనకారులు
X

దిశ ప్రతినిధి, కరీంనగర్ : పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డికి నిరసనల సెగ మొదలైంది. వెంటనే రాజీనామా చేస్తే మా నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందంటూ బీజేపీ, కాంగ్రెస్ నేతలు ఎమ్మెల్యే వాహనాన్ని అడ్డగించారు. సుమారు 20 నిమిషాల పాటు ఘెరావ్ చేశారు. ఎమ్మెల్యే కాన్వాయ్ ముందుకు వెళ్లకుండా నిలువరించారు.

పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం దేవునిపల్లి, కొదురుపాక, నారాయణపూర్ గ్రామాల్లో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించేందుకు వెళ్తున్న ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డిని బీజేపీ, కాంగ్రెస్ నాయకులు కొదురుపాక గ్రామంలో రోడ్డుపై అడ్డగించి ఘెరావ్ చేశారు. ఈ క్రమంలో పోలీసులు ఆందోళనకారులను బుజ్జగించినా వినకుండా నిరసన కొనసాగించారు. ఎమ్మెల్యే వెంటనే రాజీనామా చేయాలని, చేతగాని ఎమ్మెల్యే వల్ల నియోజకవర్గ అభివృద్ధి జరగలేదని, రోడ్లు బాగాలేవని ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోలేదంటూ ఆరోపించారు.

ఎస్ఐ ఉపేందర్ రావు నేతృత్వంలో పోలీసులు నిరసనకారులను చెదరగొట్టారు. వారిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు చాత రాజు రమేష్, కొదురుపాక మాజీ ఉప సర్పంచ్ రాజా గౌడ్, గ్రామస్తులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed