పోలీసుల తీరుపై ఆగ్రహం.. నడిరోడ్డుపై సంచార జాతుల భారీ ధర్నా

by  |
Protest, nomadic families
X

దిశ, తుంగతుర్తి: ట్రాక్టర్ ప్రమాదంలో మృతి చెందిన యువతి కేసును తారుమారు చేసి పోలీసులు తమకు అన్యాయం చేస్తున్నారని సంచార జాతుల కుటుంబాలు శనివారం రోడ్డుమీద భారీ ధర్నా చేపట్టారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ చౌరస్తాలో పెద్ద ఎత్తున ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. దీంతో నాగారం-మద్దిరాల ప్రధాన రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. బాధితుల వివరాల ప్రకారం.. కర్నూలు జిల్లా కె.మార్కాపురం గ్రామానికి చెందిన కొన్ని సంచారజాతుల కుటుంబాలు జీవనోపాధి నిమిత్తం ఇటీవలే సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం వెంపటి గ్రామానికి వచ్చారు. సంచార జాతుల కుటుంబాల్లో ఒకరైన రేకేంద్ర రాజు-పార్వతి దంపతులకు ఒక కుమార్తె ప్రియాంక(14) ఉన్నారు. గత నెల 24న ప్రియాంక ఓ పని నిమిత్తం తుంగతుర్తి మండల కేంద్రానికి వచ్చింది. అదేరోజు సాయంత్రం స్థానిక బస్టాండ్ సమీపంలో రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ఘటనలో అక్కడే ఉన్న ప్రియాంక కింద పడిపోయింది. అదే సమయంలో పక్కనుండి వెళ్తోన్న ట్రాక్టర్ ఆమె పైనుండి వెళ్లడంతో తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు ప్రియాంకను వెంటనే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. అనంతరం అక్కడ చికిత్స పొందుతూ ఈనెల 3వ తేదీన ప్రియాంక మృతిచెందారు. ఇదిలా, ఉండగా స్థానిక ఎస్ఐ ఆంజనేయులు కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. కేవలం బైకులు ఢీకొనడం వల్లే ప్రియాంక మృతి చెందినట్లుగా రికార్డుల్లో నమోదు చేశారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన మృతురాలి బంధువులు విలేకరుల ఎదుట వాపోయారు. ప్రియాంక మృతి కేసును ఎస్ఐ ఆంజనేయులు తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని, శనివారం సంచార జాతులకు చెందిన కుటుంబాలు భారీగా తుంగతుర్తి పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా చేపట్టారు. అనంతరం నాగారం-మద్దిరాల ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టారు.

తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఎస్ఐ ఆంజనేయులు కొంతమందికి కొమ్ము కాస్తూ కేసును తప్పుదోవ పట్టిస్తున్నాడని ఆరోపించారు. కాగా, ఈ ప్రమాదంపై ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తుంగతుర్తి సీఐ రవికుమార్ ప్రత్యేక విచారణ చేపట్టారు. ద్విచక్ర వాహనాల ప్రమాదం అనంతరం కిందపడిపోయిన ప్రియాంక, ట్రాక్టర్ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే చనిపోయిందని నిర్ధారించారు. అనంతరం బాధితుల వద్దకు వెళ్లి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు. విషయం తెలిసి ఈ ధర్నా కార్యక్రమానికి సామాజిక న్యాయ వేదిక వ్యవస్థాపకులు, బార్ అసోసియేషన్ అధ్యక్షులు అన్నెపర్తి జ్ఞాన సుందర్ మద్దతు పలికారు.

Next Story

Most Viewed