వాళ్లు అటెండర్లలా ఉండాలని మోడీ కల: నారాయణ

by  |
వాళ్లు అటెండర్లలా ఉండాలని మోడీ కల: నారాయణ
X

దిశ, న్యూస్‌బ్యూరో: ప్రజలను లాక్‌డౌన్‌లో పెట్టి మోడీ దేశాన్ని అమ్మేస్తున్నాడని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ ఆరోపించారు. మోడీ విధానాలతో రాష్ట్రాల్లో ప్రాంతీయ ఉద్యమాలు తలెత్తుతాయని ఆయన హెచ్చరించారు. బుధవారం హైదరాబాద్‌లోని ఆయాకార్ భవన్ వద్ద కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2020 విద్యుత్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా సీపీఐ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో కె.నారాయణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డిలు హాజరయ్యారు. ఈ సందర్భంగా నారాయణ మాటాడుతూ.. మోదీ విధానాలు రాష్ట్రాల హక్కులను కాలరాస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రులందరూ అటెండర్లలాగ ఉండాలని మోదీ కలలు కంటున్నాడని ఎద్దేవా చేశారు. ప్రధాని చెప్పిందే అందరూ వినాలన్నట్టు హుకూం జారీ చేస్తున్నారని విమర్శించారు. కేంద్ర విద్యుత్ సవరణ చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. జీఎస్టీలో రాష్ట్రాల వాటాను కేంద్రం వెంటనే చెల్లించాలన్నారు.

చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ.. విద్యుత్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా కేసీఆర్ అన్ని పార్టీలను కలుపుకొని ఉద్యమించాలని కోరారు. లాక్‌డౌన్ సమయంలో కేంద్రం అనేక సంస్కరణలు తీసుకొచ్చిందన్నారు. 2020 విద్యుత్ సవరణ చట్టం ద్వారా రాష్ట్రాల హక్కులు హరించబడుతాయని అన్నారు. జెన్కో, డిస్కంలకు స్వతంత్రత లేకుండా పోతుందన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ కంపెనీలకు ధారాదత్తం చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్రం నిర్ణయాలన్ని ఫెడరల్ వ్యవస్థని దెబ్బతీసే విధంగా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం విధానాల వల్ల రైతాంగానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందన్నారు.


Next Story