డిజిటల్ చెల్లింపులో అతిపెద్ద ఒప్పందం..

by  |
online
X

దిశ, వెబ్‌డెస్క్: భారత్‌లో వ్యాపార సంస్థలకు చెల్లింపుల సేవలందించే బిల్‌డెస్క్ కంపెనీని ప్రముఖ వినియోగదారు ఇంటర్నెట్ సేవల ప్రోసస్ ఎన్ వి సంస్థ కొనుగోలు చేసినట్టు మంగళవారం వెల్లడించింది. ఈ ఒప్పందం విలువ 4.7 బిలియన్‌ డాలర్లు (సుమారు రూ.35 వేల కోట్లు) అని, ఇది గనక పూర్తయితే దేశీయంగా డిజిటల్ చెల్లింపుల విభాగంలో అతిపెద్ద కొనుగోలు అవనుంది. దేశీయంగా అతిపెద్ద పేమెంట్ గేట్‌వే సంస్థగా ఉన్న బిల్‌డెస్క్ విద్యుత్ బిల్లులు, ఆర్‌టీసీ బస్ టికెట్ల రిజర్వేషన్లు, ఇంకా ఇతర ఆన్‌లైన్ చెల్లింపుల ప్రక్రియను నిర్వహిస్తుంది. ఇప్పటివరకు అతిపెద్ద పేమెంట్ గేట్‌వేగా ఈ సంస్థ ఉంది.

తాజాగా దీన్ని ప్రోసస్ ఎన్ వి సంస్థ చేతుల్లోకి మారడం ద్వారా ఆర్థిక సంస్థగా మారనుంది. ఈ ఒప్పందానికి సంబంధించి ఇరు సంస్థల మధ్య చర్చలు చివరి దశలో ఉన్నాయని తెలుస్తోంది. త్వరలో యాజమాన్య బదిలీ ఉంటుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటికే దేశీయంగా ‘పేయూ’ పేరుతో డిజిటల్ చెల్లింపుల సేవలందించే ప్రోసస్ సంస్థ ఈ ఒప్పందం ద్వారా మరింత పటిష్టం అవనున్నట్టు పేర్కొంది. పూర్తిగా యాజమాన్య బాధ్యతలు చేతికి వచ్చాక భారత్‌లో ఏడాదికి 400 కోట్ల లావాదేవీలను నిర్వహించగల సామర్థ్యాన్ని అందుకుంటామని ప్రోసస్ ఓ ప్రకటనలో తెలిపింది.

త్వరలో రెండు సంస్థల మధ్య ఒప్పదానికి త్వరలో కాంపిటీషన్ కమీషన్ ఆఫ్ ఇండియా అనుమతి వస్తుందని ఆశిస్తున్నట్టు కంపెనీ అభిప్రాయపడింది. త్వరలో ఆర్‌బీఐ డిజిటల్ చెల్లింపులకు సంబంధించి నియంత్రణ వ్యవస్థను తీసుకురానున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి నియమ, నిబంధనలు వెలువడనున్నాయి. ఈ క్రమంలో బిల్‌డెస్క్ కొనుగోలు పూర్తయితే అంతర్జాతీయ స్థాయిలో అతిపెద్ద చెల్లింపుల గేట్‌వేగా పేయూ సంస్థ నిలుస్తుందని ప్రోసస్ ఎన్ వి ప్రతినిధి బాబ్ వాన్ చెప్పారు. భారత్‌ను అతిపెద్ద మార్కెట్‌గా చూస్తున్నామని, ఇప్పటివరకు దేశీయంగా టెక్ సంస్థల్లో సుమారు రూ. 44 వేల కోట్ల వరకు పెట్టుబడులు పెట్టామని ఆయన ప్రస్తావించారు. దీన్ని రూ. 73 వేల కోట్లకు చేర్చాలనే లక్ష్యాన్ని కలిగి ఉన్నట్టు బాబ్ వాన్ వివరించారు.



Next Story

Most Viewed