టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్ లాభాలు రూ. 284 కోట్లు

by  |
టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్ లాభాలు రూ. 284 కోట్లు
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ దిగ్గజ టెలికాం సంస్థ భారతీ ఎయిర్‌టెల్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో రూ. 283.5 కోట్ల లాభాలను వెల్లడించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ రూ. 15,933 కోట్ల నష్టాలను నమోదు చేసింది. సమీక్షించిన త్రైమాసికంలో కంపెనీ కార్యకలాపాల ఆదాయం 15 శాతం పెరిగి రూ. 26,854 కోట్లకు చేరుకుంది. ఎయిర్‌టెల్ వినియోగదారుల నుంచి వచ్చే సగటు ఆదాయం (ఆర్పు) రూ. 146 వద్ద ఉందని కంపెనీ తెలిపింది.

‘కొవిడ్ మహమ్మారి కారణంగా సంస్థ వైర్‌లెస్ నెట్‌వర్క్ ఆదాయం ప్రతికూలంగా ప్రభావితమైందని, పరికరాల సరఫరా మందగించడం, ఆర్థిక ఒత్తిడి కారణంగా కంపెనీ మొత్తం పనితీరు దెబ్బతిన్నదని’ ఎయిర్‌టెల్ ఇండియా సీఈఓ, ఎండీ గోపాల్ మిట్టల్ చెప్పారు. సమీక్షించిన త్రైమాసికంలో 4జీ నెట్‌వర్క్ వినియోగదారులు గత సంవత్సరంతో పోలిస్తే 33.4 శాతం పెరిగి 18.4 కోట్లకు పెరిగారు. గడిచిన నాలుగు త్రైమాసికాల్లో కంపెనీ తన నెట్‌వర్క్‌లో కొత్తగా 4.6 కోట్ల 4జీ కస్టమర్లను సంపాదించిందని ఎయిర్‌టెల్ ఓ ప్రకటనలో వెల్లడించింది.



Next Story