ఫలితం వారికి… పనిష్మెంట్ వీరికి..

by  |
ఫలితం వారికి… పనిష్మెంట్ వీరికి..
X

దిశ, కరీంనగర్: విద్యుత్ వెలుగుల కోసం తమ ఆస్తులను ప్రభుత్వానికి అప్పగించిన నిర్వాసితుల జీవితాల్లో చీకటే మిగిలింది. తమ లక్ష్యాన్ని సాధించుకునేందుకు అధికారులు వేసిన ఎత్తులతో ఇక్కడి రైతులు నిర్లక్ష్యంలోనే కొట్టుమిట్టాడుతున్నారు. తమ గోడు పట్టించుకునే వారేరీ అంటూ నిర్వాసితులు అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నారు. అయినా వారికి పరిహారం అందడం లేదు. తాజాగా ఓసీపీ పేలుళ్లతో ఇళ్లు వదిలి పారిపోవల్సిన పరిస్థితి వారికి ఎదురవుతున్నది.

ఇప్పటికీ అందని పరిహారం..

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం తాడిచెర్ల మండల కేంద్రంలో ఓపెన్ కాస్ట్ ద్వారా బొగ్గు సేకరణ చేయాలని 2008లో అధికారులు నిర్ణయించారు. ఇందు కోసం 2300 ఎకరాల భూమిని సేకరించాలని నిర్ణయించి గ్రామ సభ ఏర్పాటు చేశారు. నిర్వాసితులు ఎంతో విలువైన తమ భూములను అప్పగించేందుకు నిరాకరించారు. దీంతో అధికారులు వారితో సమావేశం ఏర్పాటు చేసి భూములకు మార్కెట్ ప్రకారం ధర చెల్లిస్తామరనీ, నిర్వాసితులకు ఇంటికో ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పారు. డేంజర్ జోన్‌గా గుర్తించిన ప్రాంతంలోని 1,430 ఇళ్లకూ పరిహారం చెల్లిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఒప్పుకున్నారు. ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ ద్వారా నిర్వాసితులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. చెల్పూరులోని కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్టుకు ఈ ఓసీపీ నుంచి బొగ్గు సరఫరా చేయాలని నిర్ణయించారు. ఈ ప్రాజెక్టును ప్రైవేటు భాగస్వామ్యంతో నిర్వహించాలని నిర్ణయించారు. ఇందుకు టెండర్ పిలవగా ‘జెన్ కో’ బొగ్గు వెలికితీత కాంట్రాక్టు దక్కించుకుంది. ఆ తర్వాత జెన్ కో ప్రైవేటు కంపెనీకి బొగ్గు సేకరించేందుకు సబ్ కాంట్రాక్ట్ ఇచ్చింది. నిత్యం వేలాది టన్నుల బొగ్గును ఇక్కడి నుండి చెల్పూరు కేటీపీపీకి రవాణా చేస్తున్నారు. దాదాపు మూడేళ్లుగా ఇక్కడ బోగ్గు సేకరణ జరుపుతున్నా నిర్వాసితులను మాత్రం అధికారులు విస్మరించారు. ఉద్యోగ అవకాశాలు కల్పించకపోగా డేంజర్ జోన్‌లో ఉన్న ఇళ్లకు పరిహారం ఇవ్వలేదు. భూ సేకరణ సమయంలో స్థానికులు సర్వేలను అడ్డుకున్నప్పుడు ఇళ్లకు పరిహారం ఇస్తామని చెప్పడమే కాకుండా డీ జోన్‌లోని ఇళ్లను కూడా గుర్తించి వాటికి నెంబరింగ్ కూడా వేశారు. తీరా బొగ్గు సేకరణ ప్రారంభించిన తర్వాత అధికారులు మొహం చాటేస్తున్నారని నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

గ్రామాల్లోని ఇళ్లకూ పగుళ్లు..

ప్రాజెక్టుకు సంబంధించి 500 ఎకరాల వరకు డేంజర్ జోన్‌గా గుర్తించిన అధికారులు ఇప్పుడు వారిని పట్టించుకోవడం లేదు. తాజాగా తాడిచెర్ల ఓసీపీలో బొగ్గు సేకరణ కోసం జరుపుతున్న పేలుళ్లతో 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామాల్లో కూడా ఇళ్లు పగుళ్లు బారాయి. ఒక్కోసారి 50 వేలటన్నుల బొగ్గు కోసం పేలుళ్లకు పాల్పడుతుండటం వల్లే డేంజర్ జోన్ దాటి మరీ ఇళ్లు శిథిలమై పోయే పరిస్థితికి వచ్చాయని రైతులు చెబుతున్నారు. అనుమతికి మించి పేలుళ్లకు పాల్పడుతుండటంతో ఆ ప్రాంతంలో శబ్ద కాలుష్యంతోపాటు జనజీవనానికి ఇబ్బంది వస్తోందని రైతులు అంటున్నారు. అధికారుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా ఫలితం లేకుండా పోయిందని నిర్వాసితులు వాపోతున్నారు. ప్రధానంగా సర్వే సమయంలో రైతులు భూసేకరణను అడ్డుకున్నప్పుడు అధికారులు రైతులకు ఇచ్చిన హామీలను తీర్మానాల్లో రాయకపోవడంతో ఇప్పుడు వీరికి పరిహారం అందకుండా పోయిందని తెలుస్తోంది. కొందరు ప్రభుత్వ మెప్పు కోసం రైతులకు మాయమాటలు చెప్పి భూసేకరణ జరిపారే తప్ప రైతుల కష్టాలను మాత్రం పట్టించుకోలేదని నిర్వాసితులు ఆరోపిస్తున్నారు. అయితే, బాధితులు ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చారు. మార్చి 16 వరకు డేంజర్ జోన్ పరిధిలోని ఇళ్లకు పరిహారం ఇవ్వడంతో పాటు భూసేకరణ జరిపినప్పుడు తమకు ఇచ్చిన హామీలన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇందు కోసం కీలకమైన అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించి గ్రామ సభలు ఏర్పాటు చేయడంతోపాటు పరిహారంపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. తమ డిమాండ్ ప్రకారం ప్రభుత్వం స్పందించకపోతే మార్చి 20 నుంచి బొగ్గు సేకరణను అడ్డుకుంటామని నిర్వాసితుల సంఘం హెచ్చరిస్తోంది. అయితే, ప్రభుత్వం స్పందించి బాధితులను ఆదుకుంటుందో లేదో చూడాలి మరి..

Tags: tadicherla ocp project, genco, coal extraction, procurement, Thermal Power Project


Next Story

Most Viewed