వరంగల్‌లో ఏడాదికోసారి ఇదే జరుగుతోంది

by  |
వరంగల్‌లో ఏడాదికోసారి ఇదే జరుగుతోంది
X

దిశ ప్రతినిధి, వరంగల్: గ్రేటర్ వరంగల్ రోడ్లు నరక కూపంలా మారాయి. వర్షాలకు ముందే గుంతలుగా ఉన్న రోడ్లు.. వర్షాలు కురిసిన తర్వాత మరీ దారుణంగా తయారయ్యాయి. కాలినడకన కూడా సరిగా నడవలేని దుస్థితి నెలకొంది. బయటకెళ్తే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వెళ్లాల్సి వస్తోంది. ఏటా త్రిగనగరిలో రోడ్ల మరమ్మతులకు కోట్లు వెచ్చిస్తున్నా ఇబ్బందులు తప్పడం లేదు. ఇటీవల నగరంలో కురిసిన వర్షాలకు పలు కాలనీల్లోకి నీరు చేరింది. రోడ్లు కోతకు గురయ్యాయి. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

బల్దియా పరిధిలో 2,775 కిలోమీటర్ల రోడ్ల వ్యవస్థ ఉంది. ప్రధాన మార్గాలు 300 కిలోమీటర్లు ఉండగా ఇందులో 100, 80, 60, 40 ఫీట్ల రోడ్లున్నాయి. ఈ రోడ్లపై జాతీయ రహదారులు, ఆర్‌అండ్‌బీ, బల్దియా ప్రభుత్వ మూడు శాఖల పర్యవేక్షణ ఉంటుంది. రాంపూర్ నుంచి కాజీపేట, హన్మకొండ, అలంకార్, ములుగు రోడ్డు కూడలి మీదుగా ఆరెపల్లి వరకు కేయూసీ వంద ఫీట్ల రోడ్డు నుంచి పెద్దమ్మగడ్డ వరకు కరీనంగర్ ఎల్లాపూర్ గ్రామశివారు నుంచి హసన్‌పర్తి, భీమారం, కేయూసీ చౌరస్తా నయీంనగర్ మీదుగా హన్మకొండ పబ్లిక్ గార్డెన్ వరకు ప్రధాన రహదారులన్నీ జాతీయ రహదారుల శాఖ పరిధిలో ఉన్నాయి. రద్దీగా ఉండే రోడ్లపై బీటీవేసి గుంతలు పూడ్చాలి. అంతంత మాత్రంగానే పనులు చేస్తున్న కాంట్రాక్టర్లు చేతులు దులుపుకుంటున్నారు. ఏటా 30 నుంచి 40 లక్షల మేర తాత్కాలిక పనులు చేస్తూ ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

అడుగడుగునా గుంతలు

నగరంలోని సగానికిపైగా ప్రధానరోడ్లు భారీగా దెబ్బతిని, అడుగుగడుగునా గుంతలు ఏర్పడినా అధికారులు పట్టించుకోవటం లేదు. వర్షాలు ఆగిపోయినా దెబ్బతిన్న రోడ్లకు తాత్కాలిక మరమ్మతులు చేయకపోవడంతో గుంతలు పడిన రోడ్లపై వాహనాలు నడపాలంటే వాహనదారులు హడలెత్తిపోతున్నారు. నగరంలో హన్మకొండ బస్‌డిపో రోడ్డు, బాలసముద్రం మెయిన్‌రోడ్డు, బస్టాండు పద్మాక్షి గుడి రోడ్డు, ఆటోనగర్ జంక్షన్ రోడ్డుతో పాటు మరికొన్ని ప్రాంతాల్లోని రోడ్లు భారీ వర్షాలకు భారీగా దెబ్బతిన్నాయి. చాలాచోట్ల రెండు మూడు అడుగులలోతు గుంతలు ఏర్పడాయి. వరంగల్ హెడ్‌పోస్టాఫీస్ జంక్షన్, అండర్ బ్రిడ్జి రోడ్లు భారీగా దెబ్బతిన్నాయి. ములుగు రోడ్డు నుంచి పోచమ్మ మైదానం వచ్చే ఆటో నగర్ రోడ్డు పరిస్థితి మరీ దారుణంగా తయరైంది. న్యూ శాయంపేట్ నుంచి హన్మకొండ చౌరస్తా వరకు ఉన్న పద్మాక్షి టెంపుల్ ప్రధాన మార్గం భారీవర్షాలకు తారు, కంకర లేచి గోతులు ఏర్పడిన కారణంగా వాహనదారులు అష్టకష్టాలు పడుతున్నారు.

కాంట్రాక్టర్లకు కాసుల వర్షం..

లెక్కాపత్రం లేకుండా ఇష్టానుసారంగా రోడ్లేస్తూ చేయని పనులకు సైతం బిల్లులు పెట్టుకుని అక్రమంగా ప్రజల సొమ్మును కాజేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వరంగల్‌ నగరంలో కొన్ని ప్రధాన రోడ్లు కాంట్రాక్టర్లకు ఇంజినీర్లకు కాసులు కురిపిస్తున్నాయి. మరమ్మతులు చేసిన రోడ్లు పదే పదే మరమ్మతులకు గురవుతున్నాయి. వాటినే మళ్లీ మళ్లీ మరమత్తులు చేస్తూ అందిన కాడికి దోచుకుంటున్నారు. అధికారులు మాత్రం మూడు, ఆర్నెల్లకోసారి పైపై మెరుగులతో మరమతుల పేరుతో ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారనే విమర్శలున్నాయి. కాజీపేట, హన్మకొండ, వరంగల్‌ త్రినగరాల్లో ప్రధాన రోడ్ల రిపేర్ల కోసం ఏటా రూ. 4 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. జాతీయ రహదారుల సంస్థ రూ. 30 లక్షలు, ఆర్‌అండ్‌బీ ఒకకోటి, మహా నగరపాలక సంస్థ రూ. 2.50 కోట్లకుపైనే నిధులు వెచ్చిస్తున్నట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. హన్మకొండలోని పద్మాక్షిగుట్ట రోడ్డు గుత్తేదార్లు, ఇంజినీర్లకు కల్పతరువులా మారింది. రెండేళ్లుగా మరమ్మతుల కోసం ఏటా రూ. 3 లక్షలు ఖర్చు పెడుతున్నారు. విజయటాకీస్‌ రోడ్డు ఆంజనేయస్వామి గుడి నుంచి కొత్త బస్టాండ్‌ కూడలి వరకు ఆర్నెళ్లకోసారి రహదారి మరమ్మతులు చేస్తున్నారు. ఏటా రూ.5 లక్షలు ఖర్చవుతున్నాయి. పూర్తిస్థాయిలో రోడ్డు వేయడం లేదు. ఐదు నెలల క్రితం రూ. 5 లక్షలతో తారురోడ్డు వేశారు. గుంతలన్నీ పూడ్చారు. నాలుగు నెలలకే మళ్లీ గుంతలు పడ్డాయి.

ఏడాది తిరగకముందే..

ములుగు రోడ్డులోని హనుమాన్ జంక్షన్ నుంచి ఆటోనగర్‌ పోచమ్మ మైదాన్‌ వరకు 80 అడుగుల రోడ్డు వరకు ఆర్‌అండ్‌బీ శాఖ కొత్తగా తారురోడ్డు వేశారు. ఏడాది తిరగక ముందే గుంతలు పడ్డాయి. మూడేళ్లలో రహదారి రిపేర్ల కోసం రూ. 4.5 లక్షలు ఖర్చుపెట్టారు. ఏటా గణేశ్‌ నిమజ్జనం, సద్దుల బతుకమ్మ పండుగల పేరుతో రహదారి మరమ్మతుల కోసం రూ. 2 లక్షలు వెచ్చిస్తున్నారు. అయినప్పటికీ సమస్య తీరడం లేదు.

Next Story

Most Viewed