ప్రియాంక కారులో రేవంత్.. ప్రైవేట్ టాక్ ఆంతర్యమేంటి?

by  |
Priyanka Gandhi, Revanth Reddy
X

బెంగళూరులో జరిగిన ఓ శుభకార్యానికి హాజరైన ప్రియాంకాగాంధీ తెలంగాణ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిని ప్రత్యేకంగా పిలిపించుకొని మాట్లడారు. ఆ శుభకార్యానికి హాజరైన సీనియర్ కాంగ్రెస్ నేతలంతా ఒక్క చోటే ఉన్నప్పటికీ కొంత దూరంలో ఉన్న రేవంత్ రెడ్డి గురించి ఆరా తీశారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలతో మాట్లాడి వెళ్ళిపోతున్న క్రమంలో కారులో ఎక్కి కూర్చుకున్న ప్రియాంకాగాందీ తన సెక్యూరిటీ సిబ్బంది ద్వారా రేవంత్ రెడ్డిని కారు దగ్గరకే పిలిపించుకున్నారు. ఇద్దరూ కొద్దిసేపు కారులో కూర్చునే మాట్లాడుకున్నారు. పీసీసీ చీఫ్ ఎన్నిక ప్రకటన వాయిదా పడిన నేపథ్యంలో ఆమె రేవంత్ రెడ్డితో ఏం మాట్లాడారు అనేది కాంగ్రెస్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

దిశ, తెలంగాణ బ్యూరో: రేవంత్‌రెడ్డితో ప్రియాంకాగాంధీ ఏం చర్చించారు? ప్రత్యేకంగా పిలిపించుకుని ఏం మాట్లాడారు? తెలంగాణ కాంగ్రెస్ నేతలు చాలా మంది ఉన్నా ప్రత్యేకంగా ఆయన్నే పిలిపించుకోవడానికి కారణమేంటి? రెండు మూడు నిమిషాల పాటు మాత్రమే వారు మాట్లాడుకున్నా అందులోని విశేషాలేంటి? రేవంత్ రెడ్డికి ఆమె ఇచ్చిన టాస్క్ ఏంటి? పీసీసీ చీఫ్ ప్రకటన వాయిదా పడిన నేపథ్యంలో రేవంత్‌తో విడిగా ఆమె ఏం మాట్లాడి ఉంటారు? ఇదే ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో హాట్ టాపిక్.

‘రాజీవ్ రైతు భరోసా’ పేరుతో తొమ్మిది రోజుల పాటు తెలంగాణలో జరిగిన పాదయాత్ర, ముగింపు సభ వివరాలన్నీ కాంగ్రెస్ అధిష్టానానికి చేరుకున్నాయి. మూడు రోజుల క్రితం బెంగుళూరులోని ఓ ప్రైవేటు హోటల్‌లో జరిగిన కార్యక్రమానికి హాజరైన ప్రియాంకాగాంధీ ప్రత్యేకంగా రేవంత్‌రెడ్డిని పిలిపించుకుని కొద్దిసేపు మాట్లాడారు. కర్నాటక పీసీసీ చీఫ్ కుమార్తె ఐశ్వర్య, మాజీ ముఖ్యమంత్రి ఎస్ఎం కృష్ణ మనుమడు (కాఫీ డే యజమాని దివంగత వీజీ సిద్ధార్థ కుమారుడు) అమర్త్య హెగ్డేల వివాహ రిసెప్షన్ కార్యక్రమానికి ప్రియాంకతో పాటు రాహుల్ కూడా హాజరయ్యారు. తెలంగాణ కాంగ్రెస్ తరఫున ఉత్తమ్, రేవంత్, పొన్నం ప్రభాకర్, మధుయాష్కీ, మాజీ ఎంపీలు సిరిసిల్ల రాజయ్య, బలరాం నాయక్ తదితరులు పలువురు హాజరయ్యారు. ఆ వేదిక దగ్గర వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణపై ఆసక్తి నెలకొంది.

రిసెప్షన్ కార్యక్రమం ముగిసిన తర్వాత వెళ్ళిపోతున్న క్రమంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలతో కొద్దిసేపు ప్రియాంక మాట్లాడారు. పొన్నం ప్రభాకర్ చొరవ తీసుకుని తెలంగాణ పర్యటనకు రావాల్సిందిగా ఆహ్వానించారు. ఆ సమయంలో రేవంత్ రెడ్డి కొద్ది దూరంలో ఉన్నారు. ఇప్పటిదాకా సోనియాగాంధీ, రాహుల్‌గాంధీతో మాత్రమే కలిసిన రేవంత్ రెడ్డి ప్రియాంకాగాంధీతో మాత్రం మాట్లాడలేదు. తెలంగాణ కాంగ్రెస్ నేతలంతా ఒక్కచోటనే ఉన్నప్పటికీ రేవంత్‌రెడ్డి కాస్త దూరంలో ఉండడంతో స్వయంగా ఆమె దృష్టి అతనిపై పడి ప్రత్యేకంగా పిలిపించుకుని మాట్లాడడం విశేషం. రేవంత్ రెడ్డి గురించి వినడమే తప్ప ఎప్పుడూ మాట్లాడని ప్రియాంక తొలిసారిగా తెలంగాణలో పార్టీ అంశాలను, పాదయాత్రకు సంబంధించిన స్పందన గురించి ఆరా తీయడం గమనార్హం.

పాదయాత్ర రెస్పాన్స్ ఎలా ఉంది?

తెలంగాణ కాంగ్రెస్ నేతలతో మాట్లాడి వెళ్ళిపోతున్న క్రమంలో కారులో ఎక్కి కూర్చుకున్న ప్రియాంకాగాందీ తన సెక్యూరిటీ సిబ్బంది ద్వారా రేవంత్ రెడ్డిని కారు దగ్గరకే పిలిపించుకున్నారు. ఇద్దరూ కొద్దిసేపు కారులో కూర్చునే మాట్లాడుకున్నారు. రైతాంగ సమస్యలపై తెలంగాణలో పాదయాత్ర చేసిన తర్వాత ప్రజల నుంచి, రైతుల నుంచి స్పందన ఎలా వచ్చిందో రేవంత్‌ని అడిగి తెలుసుకున్నారు. పాదయాత్ర క్రమంలో రైతులు ప్రధానంగా ఏయే అంశాలను ప్రస్తావించారు, కాంగ్రెస్ పార్టీ పట్ల ఎలా స్పందిస్తున్నారు, రైతుల సమస్యలపై కాంగ్రెస్ పార్టీ చేపట్టిన పాదయాత్రలో రైతుల్లో ఎలాంటి అభిప్రాయం ఉంది, ప్రస్తుతం తెలంగాణలో రైతుల పరిస్థితి ఏంటి, కొత్త వ్యవసాయ చట్టాలపై వారికున్న అవగాహన ఏపాటిది, ఆ చట్టాల అమలుతో రైతులకు జరిగే నష్టం ఏ స్థాయిలో ఉంటుంది.. ఇలా అనేక అంశాలపై ఆమె ఆరా తీశారు.

ఫోటోలు, వీడియోలు పంపండి

పాదయాత్రకు వచ్చిన స్పందనను వివరించిన రేవంత్ రెడ్డి భవిష్యత్తులో పార్టీ చేపట్టే కార్యక్రమాలకు కూడా ఎలాంటి అవకాశం ఉంటుందో ఆమెకు వివరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రైతాంగ సంక్షేమ పథకాలు అమలు ఎలా ఉన్నా రైతుల పరిస్థితి మాత్రం దయనీయంగానే ఉందని, పండిన పంటకు గిట్టుబాటు ధర ప్రధాన సమస్యగా ఉందని వివరించారు. పాదయాత్రకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు తనకు పంపాల్సిందిగా రేవంత్‌రెడ్డికి ప్రియాంక సూచించి ఢిల్లీ వచ్చినప్పుడు కలవాలని చెప్పారు. డిఫెన్స్ కమిటీ (పార్లమెంటరీ స్థాయీ సంఘం) సమావేశం ఉన్నందున గురువారం, శుక్రవారం ఢిల్లీలోనే ఉన్నప్పటికీ ప్రియాంకాగాంధీని కలవలేదు. పార్లమెంటరీ బడ్జెట్ సమావేశాల రెండవ సెషన్ సందర్భంగా ఆమెను ప్రత్యేకంగా కలిసే అవకాశం ఉంది.

Next Story

Most Viewed