ప్రైవేట్ టీచర్లు.. రూ.2 వేల కోసం దరఖాస్తు చేసుకోండిలా..

by  |
ప్రైవేట్ టీచర్లు.. రూ.2 వేల కోసం దరఖాస్తు చేసుకోండిలా..
X

దిశ, వెబ్ డెస్క్ : కరోనా కాలం మోయలేని భారంగా మారింది ప్రైవేట్ టీచర్లకు. కరోనా లాక్ డౌన్ తో ఆర్థిక పరమైన ఇబ్బందిని ఎదుర్కొన్నారు. ఆర్ధిక భారంతో కొంత మంది ప్రైవేట్ టీచర్లు చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే రాష్ట్రంలో ప్రైవేట్ స్కూళ్లు తిరిగి ప్రారంభమయ్యే వరకు ప్రతీ నెలా రూ.2వేలు నగదు సాయంతో పాటు కుటుంబానికి 25 కిలోల చొప్పున బియ్యాన్ని రేషన్‌ షాపుల ద్వారా ఉచితంగా సరఫరా చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఆర్థిక ఇబ్బందులతో రెండు రోజుల క్రితం నల్గొండ జిల్లా నాగార్జునసాగర్‌లో ప్రైవేట్ టీచర్ కుటుంబం(భర్త, భార్య) ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ప్రైవేటు టీచర్లు ఈ సాయం కోసం ఎలా దరఖాస్తు చేయాలన్న విషయమై అధికారులు మార్గదర్శకాలను జారీ చేశారు.

టీచర్ల బ్యాంకు ఖాతా, ఐఎఫ్ఎస్ఈ కోడ్, ఆధార్ వివరాల నమోదు తప్పనిసరని వారు తెలిపారు. ఇక ఒకసారి దరఖాస్తు చేసిన తరువాత ఎంఈఓలు, డీఈఓలు తదితర అధికారులు తనిఖీలు చేసి, కలెక్టర్ ద్వారా విద్యాశాఖకు వివరాలు పంపుతారు. వీటి ప్రకారం, గుర్తింపు పొందిన ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యం నుంచి అక్కడ పనిచేసే టీచర్ల వివరాలను ఆన్ లైన్ మాధ్యమంగా అధికారులు సేకరిస్తారు. ఈ వివరాలను స్కూళ్ల యాజమాన్యాలు “schooledu.telangana.gov.in” వెబ్ సైట్ లో నమోదు చేయాల్సి వుంటుంది. టీచర్ల వివరాల నమోదు ప్రక్రియ ఏప్రిల్ 15వ తేదీ వరకూ కొనసాగుతుంది. ఆపై 19 వ తేదీ వరకూ వాటి పరిశీలన కొనసాగుతుంది. దాని తరువాత 24వ తేదీ లోపు టీచర్ల ఖాతాల్లో రూ. 2 వేలు జమ అవుతుందని, 21వ తేదీ నుంచి 25వ తేదీ లోపు రేషన్ షాపుల ద్వారా వారికీ 25 కిలోల బియ్యం అందిస్తామని ప్రభుత్వం పేర్కొంది.


Next Story

Most Viewed