సర్కార్ ల్యాండ్‌పై ప్రైవేటు వ్యక్తుల పెత్తనం.. కోట్ల ఆస్తిపై ప్రభుత్వం శీతకన్ను

by  |
సర్కార్ ల్యాండ్‌పై ప్రైవేటు వ్యక్తుల పెత్తనం.. కోట్ల ఆస్తిపై ప్రభుత్వం శీతకన్ను
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : ప్రభుత్వ భూములను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వ శాఖ, జిల్లా అధికార యంత్రాంగంపై ఉన్నది. సర్కార్ ల్యాండ్ కబ్జాలకు గురి కాకుండా వాటికి సరిహద్దులను గుర్తించి.. ఫెన్సింగ్ వేసి సంరక్షిచడం ప్రభుత్వ అధికారుల కనీస బాధ్యత. కానీ నిజామాబాద్ నడి బొడ్డున కోట్ల రూపాయలు విలువ చేసే సర్కారు భూమిని ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేసే ప్రయత్నాలు ముమ్మరంగా జరగుతున్నాయనే అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

అందులో రెవెన్యూ, ల్యాండ్ సర్వే అధికారులు, రిజిస్ర్టేషన్ శాఖలు కబ్జాదారులకు సహకరిస్తుండటంతో రెపో మాపో.. కోట్ల విలువ చేసే ఫిషరీస్ శాఖ భూమి ప్రైవేట్ వ్యక్తుల చేతిలోకి వెళ్లడం ఖాయంగా కనిపిస్తోందనే చర్చ జిల్లా కేంద్రంలో జరుగుతున్నది. పకడ్బంధీగా పక్కా ప్రణాళికతో సర్కారు భూమిని ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించేందుకు రూట్ క్లియర్ అయినట్టు తెలుస్తోంది. జిల్లా కేంద్రంలో ఇటీవల జరుగుతున్న వరుస ఘటనలే ఇందుకు సాక్ష్యంగా నిలుస్తున్నాయి.

నిజామాబాద్ నగరంలోని బోధన్ రోడ్డులో ఆర్సపల్లి వద్ద మత్స్యశాఖకు 2848, 2849 సర్వే నెంబర్‌లో 6 ఎకరాల 26 గుంటల భూమి ఉంది. గతంలో ఎనిమిది ఎకరాల వరకు సర్కారు ల్యాండ్ ఉండగా అందులో రెండు ఎకరాలు కబ్జాకు గురైంది. ఆ కబ్జా భూమిలో ఇండ్ల నిర్మాణాలు సైతం జరిగాయి. ప్రస్తుతం 2848 సర్వే నెంబర్‌లో ఎకరం 4 గుంటల భూమి ఉండగా, 2849 సర్వే నెంబర్‌లో 3 ఎకరాల 13 గుంటల భూమి ఉంది. సంబంధిత భూమిలో జిల్లా మత్య్సశాఖ సహాయ సంచాలకుల, జిల్లా మత్స్యశాఖాధికారి కార్యాలయాలతో పాటు, ఫిష్ పాండ్ ఉండగా మిగిలిన ప్రాంతం ఖాళీగా ఉంది. ఇది దశాబ్దాలుగా మత్స్యశాఖ ఆధీనంలోనే ఉంది.

అయితే, పది సంవత్సరాల కాలంలో ఆ భూమి పక్కనే ఎన్ఆర్ఐ కాలనీ ఏర్పడటంతో భూముల ధరలు కోట్లకు చేరాయి. దీంతో సర్వే నెంబర్‌ల ఆధారంగా ప్రైవేట్ భూముల పేరిట ఆక్రమణలు పెరిగాయి. గతంలో ఎనిమిది ఎకరాలు ఉండగా అందులో 6 ఎకరాలు మాత్రమే ప్రస్తుతం మిగిలి ఉంది. ఇందులో కుడా ఎకరం 4 గుంటల భూమిపై వివాదం నడుస్తోంది.

2016 వరకు మత్స్యశాఖ ఆధీనంలో ఉన్న భూమిపై అక్రమార్కుల కన్ను పడింది. అందుకు కారణం 2009లో నిజామాబాద్ రెవెన్యూ కార్యాలయం అగ్ని ప్రమాదంలో దగ్ధమైంది. దీంతో ప్రభుత్వ, ప్రైవేట్ భూములకు రక్షణ లేకుండా పోయింది. ఎకరం 4 గుంటల భూమి 2848 సర్వే నంబర్‌లో ఉండగా, కొందరు వ్యక్తులు అది మరో నంబర్‌లో ఉందని ఆ భూమికి యజమానులం మేమే అని ముందుకు వచ్చారు. అందులో కోళ్ళఫారం, ఆయిల్ మిల్ ఉందని, పహానీలలోకి ఎక్కింది.

కానీ, వాస్తవంగా దశాబ్దాలుగా సదరు భూమి మత్స్యశాఖ ఆధీనంలోనే ఉంది. ఎవరైతే ప్రైవేట్ వ్యక్తులు భూమి తమది అని అంటున్నారో.. వారు జాయింట్ సర్వేకు దరఖాస్తు చేసుకున్నారు. 2019 నవంబర్ 1న సర్వే చేసి అది మత్స్యశాఖదే అని తేల్చారు ల్యాండ్ సర్వే సహాయ సంచాలకులు. కానీ, ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ.. గతేడాది జూలై 23న ఉత్తర మండల తహసీల్దార్ సర్వే చేసి ఆ భూమి ప్రైవేట్ వ్యక్తులదేనని తేల్చారు. దీనిపై జిల్లా సర్వేయర్, సహాయ సంచాలకుల సర్వేయర్ సంతకాలు లేకుండానే ఈ తతంగం జరిగింది. విషయం తెలిసిన జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి సర్వేయర్ అరుణను సస్పెండ్ చేశారు. అదే విధంగా అధికారులపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని ల్యాండ్ సర్వే కమిషనర్‌ను ఆదేశించారు.

ల్యాండ్ సర్వే కమిషనర్ సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోకుండా జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధి అడ్డంపడుతున్నట్టు తెలుస్తోంది. దానికి తోడు సర్వేయర్ తప్పేమీ లేదన్నట్లు ఆమె రీ-పోస్టింగ్‌కు ప్రయత్నాలు షురూ అయ్యాయి. అనధికారికంగానే సర్వేయర్ విధుల్లో చేరినట్లు సమాచారం. ఈ తంతు ఇలా జరుగుతుండగానే ఈ నెల 18న కొందరు కబ్జాదారులు సర్వే తమకు అనుకూలంగా ఉందని, ఇప్పటి వరకు 3 రిజిస్ట్రేషన్లు జరిగాయని, కబ్జాకు ప్రయత్నించారు. ఈ విషయంపై జిల్లా మత్స్యశాఖాధికారులు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కబ్జాదారులను అక్కడి నుంచి వెళ్లగొట్టేందుకు పోలీసులకు తలప్రాణం తోకకు వచ్చింది.

అదే సమయంలో కబ్జాదారులు తెలివిగా వ్యవహరించి తమకు కోర్టు ఆర్డర్ ఉందని మభ్యపెట్టే ప్రయత్నం మొదలుపెట్టారు. కానీ, అది అధికారుల వద్ద పూర్తి రికార్డు ఉండటంతో వారి పప్పులు ఉడకలేదు. స్థానిక పోలీస్ స్టేషన్‌లో కబ్జా ప్రయత్నంపై బుధవారం ఎఫ్‌ఐఆర్ నమోదైంది. జిల్లా మత్స్యశాఖ కార్యాలయం భూముల కబ్జాపై మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆరా తీసినట్లు తెలిసింది. అధికార యంత్రాంగం పూనుకుని ప్రభుత్వ భూమి చుట్టూ ఫెన్సింగ్ వేస్తే కానీ.. భూములు మిగిలే అవకాశం లేదు. జిల్లా అధికార యంత్రాంగం ఫిషరీస్ కార్యాలయం ఒకవేళ కొత్త కలెక్టరేట్‌లోకి మార్చితే ఇక్కడ కబ్జాదారుల నుంచి భూమిని కాపాడే అవకాశాలు శూన్యమయ్యే పరిస్థితి ఉంది.

Next Story