గ్రామీణ భారతానికి కరోనా విస్తరించొద్దు : ప్రధాని

by  |
గ్రామీణ భారతానికి కరోనా విస్తరించొద్దు : ప్రధాని
X

న్యూఢిల్లీ: కరోనావైరస్ మూలంగా లాక్‌డౌన్ విధించడంతో వలస కూలీలను అన్ని దేశాలు, రాష్ర్టాలు స్వస్థలాలకు తరలిస్తున్నాయి. దీని మూలంగా కరోనా వైరస్ మరింత విస్తరించే అవకాశం ఉందని ప్రధాని మోడీ అన్నారు. కొవిడ్-19ను విజయవంతంగా ఎదుర్కొంటున్న భారత్‌ వైపు ప్రపంచ దేశాలు చూస్తున్నాయని, వైరస్‌ను మనం కట్టడి చేస్తున్న తీరుకు అంతర్జాతీయంగా గుర్తింపు వస్తున్నదని ఆయన అభిప్రాయపడ్డాడు. కరోనాపై మనం చేస్తున్న ఈ పోరాటంలో రాష్ట్ర ప్రభుత్వాలదే కీలక పాత్ర అని గుర్తుచేశారు. మున్ముందు కూడా ఇదేవిధంగా కరోనాపై పోరును కేంద్రం, రాష్ట్రాలు కలిసి సాగించాలని కోరారు. సోమవారం దేశంలోని అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని నరేంద్ర మోడీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మన దేశంలో కరోనా వ్యాప్తి ప్రారంభమైన తర్వాత సీఎంలతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించడం ఐదోసారి. గత సమావేశాల్లో కొందరు సీఎంలతోనే చర్చించారు. ఈసారి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొనేందుకు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతోనూ మాట్లాడి పరిస్థితులను తెలుసుకున్నారు. మరోసారి లాక్‌డౌన్‌ పొడిగించాలా? లేక మరిన్ని సడలింపులనివ్వాలా? మొత్తానికే ఎత్తేయాలా? అనే విషయం గురించి ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ చర్చ సాగింది. త్వరలో ఆర్థిక కార్యకలాపాలు తిరిగి పుంజుకుంటాయని ప్రధాని మోడీ అభిప్రాయపడ్డారు. మే 17 తర్వాత మరిన్ని సడలింపులతో లాక్‌డౌన్‌ను పొడిగించబోతున్నట్టు సంకేతాలనిచ్చారు. మూడో దశ లాక్‌డౌన్‌లోనే చాలా మినహాయింపులనిచ్చిన విషయం తెలిసిందే. వలస కూలీల తరలింపులతో కరోనా మహమ్మారి మరింత వ్యాపించే ప్రమాదం ఉందనే ఆందోళనను మోడీ వ్యక్తపరిచారు. అందుకే గ్రామీణ భారతానికి మహమ్మారి విస్తరించకుండా అడ్డుకోవడమే ప్రస్తుతం మనముందున్న అతిపెద్ద సవాలు అని సీఎంలతో చెప్పారు. కరోనా వైరస్ కేసుల పెరుగుదలపై ఆయన స్పందిస్తూ ఎక్కడైతే లాక్‌డౌన్ నిబంధనలు సరిగ్గా పాటించలేదో అక్కడే కేసులు అధికంగా నమోదయ్యాయని చెప్పారు. గత కొన్ని రోజులుగా కరోనాపై పోరును ఏ పద్ధతిలో సాగించాలో జిల్లా స్థాయి అధికారుల వరకు అందరికీ మంచి అవగాహన వచ్చిందన్నారు.

వీడియో కాన్ఫరెన్స్‌లో రాష్ట్రాల ముఖ్యమంత్రులు భిన్నమైన అభిప్రాయాలు వెలిబుచ్చారు. రైల్వే సేవలను పునరుద్ధరించడాన్ని తెలంగాణ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు వ్యతిరేకించారు. లాక్‌డౌన్ మరింత కాలం పొడిగించాలని ప్రధానికి మహారాష్ట్ర, పంజాబ్, పశ్చిమబెంగాల్, తెలంగాణ, పంజాబ్ రాష్ట్రాల సీఎంలు విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వంపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మండిపడ్డారు. కొవిడ్-19ను చూపిస్తూ మోదీ ప్రభుత్వం రాజకీయాలు చేస్తున్నదని విమర్శించారు. కాగా, తమిళనాడు సీఎం పళని స్వామి సహా మరికొందరు కొవిడ్-19పై పోరాడేందుకు ఆర్థిక సహకారాన్ని అందించాలని ప్రధానిని కోరారు. జీఎస్టీ వసూళ్లలో రాష్ట్రాల వాటాను అందజేయాలని, ఆర్థిక కార్యకలాపాలు వేగంగా తిరిగి పుంజుకునేందుకు బంగ్లాదేశ్‌తో రోడ్డు మార్గాలకు అవకాశమివ్వాలని త్రిపుర సీఎం బిప్లవ్ దేవ్ అభ్యర్థించారు. కరోనాపై పోరులో ప్రధాన నిర్ణయాలు తీసుకొనే అధికారం రాష్ట్రాలకు ఉండాలని పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్, ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేష్ భాగెల్‌లు అభిప్రాయపడ్డారు. కరోనా వైరస్ వ్యాప్తికి సంబంధించి రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్‌ల గుర్తింపు ప్రక్రియను రాష్ట్రాలకు వదిలిపెట్టాలని సూచించారు.



Next Story