బ్లాక్ మెయిల్.. టీఆర్ఎస్ సభ్యత్వం వద్దంటే అంతే సంగతులు..!

by  |
బ్లాక్ మెయిల్.. టీఆర్ఎస్ సభ్యత్వం వద్దంటే అంతే సంగతులు..!
X

దిశ ప్రతినిధి, మెదక్: ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకం అందుతుందని చెబితే చాలు.. సభ్యత్వం తీసుకోవాలని అధికార పార్టీ నాయకులు ఒత్తిడి చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. సభ్యత్వ నమోదుకు ఇన్‌చార్జీలుగా వ్యవహరిస్తున్న టీఆర్ఎస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు స్వయం సహాయక సంఘాలతో సమావేశమై ప్రతి గ్రూపులోని మహిళలందరూ ఖచ్చితంగా సభ్యత్వ నమోదు చేసుకోవాలని బెదిరింపులకు గురిచేస్తున్నట్టు సమాచారం. సభ్యత్వ నమోదు చేసుకుంటే బీమా సౌకర్యం కల్పిస్తామంటూ చెబుతుండటంతో కొందరు ఇష్టం లేకపోయిన సభ్యత్వం చేయించుకుంటున్నారు.

ఉమ్మడి మెదక్ జిల్లాలో ప్రస్తుతం సభ్యత్వ నమోదు చేసుకోవాలని బెదిరింపుల పర్వం కొనసాగుతుంది. జిల్లా మంత్రి హరీశ్ రావు విధించిన లక్ష్యం అధిగమించేందుకు నాయకులు నానా తంటాలు పడుతున్నారు. టీఆర్ఎస్‌కు కంచుకోటగా ఉన్న మెదక్ జిల్లాలో టీఆర్ఎస్ పార్టీకి ఈ మధ్య కొంత వ్యతిరేకత పెరిగిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని కప్పిపుచ్చుకునేందుకు సభ్యత్వ నమోదును ఆసరాగా చేసుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఆరు లక్షల సభ్యత్వ నమోదు లక్ష్యం పెట్టుకోగా అందులో సగం వరకు నెరవేరినట్టు జిల్లా ముఖ్య నాయకుల నుంచి సమాచారం. ఇంకో సగం చేయించడంపై నాయకులు నానా తంటాలు పడుతున్నారు.

బెదిరింపులతో పనులు..!

అయితే, పలుచోట్ల అధికార పార్టీ నాయకులు బ్లాక్ మెయిల్‌కు, బలవంతపు చర్యలకు పాల్పడుతున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. వృద్ధులు పింఛన్ తీసుకోవడానికి వెళ్తే అక్కడే నాయకులు తిష్టవేసి మరీ.. సభ్యత్వ నమోదు చేయిస్తున్నారు. రూ.30 సభ్యత్వం చేయించుకుంటే రూ.2 లక్షల ఇన్సూరెన్స్ కల్పిస్తామని చెబుతూ… పార్టీ సభ్యత్వ నమోదు చేయించుకుంటున్నారు. మహిళ సంఘం గ్రూపు మెంబర్లను కూడా వీవోలతో టీఆర్ఎస్ లోపాయికారి ఒప్పందం కుదుర్చుకుని సభ్యత్వ నమోదు చేయిస్తున్నట్టు సమాచారం. లేనిపక్షంలో ‘మీకు రుణం ఇవ్వం… పింఛన్లు ఇవ్వబోమని బెదిరిస్తున్నారని పలువురు మహిళలు, వృద్ధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాలపై ప్రతి పక్ష నాయకులు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. సభ్యత్వం కోసం సామాన్య ప్రజలను ఇబ్బంది పెట్టడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.



Next Story

Most Viewed