హైదరాబాద్‌లో కొత్త సోలార్ యూనిట్ ప్రారంభం

by  |
హైదరాబాద్‌లో కొత్త సోలార్ యూనిట్ ప్రారంభం
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ప్రముఖ సోలార్ పీవీ సెల్స్, మాడ్యూల్స్ తయారీ కంపెనీలలో ఒకటైన ప్రీమియర్ ఎనర్జీస్ హైదరాబాద్‌లో కొత్త ప్లాంట్‌ను ప్రారంభించింది. రూ. 483 కోట్లకు పైగా పెట్టుబడులతో ఈ కొత్త ప్లాంట్‌లో 19.2 శాతం సామర్థ్యం కలిగిన పాలిక్రిస్టలైన్ సెల్స్ ట్రయల్ ఉత్పత్తిని ప్రారంభించినట్టు ఓ ప్రకటనలో తెలిపింది. ఈ ప్లాంట్‌లో 158.7 మి.మీ X 158.75 మి.మీ కొలతలున్న సోలార్ సెల్స్‌ను అధిక నాణ్యత కలిగిన సెలికాన్ వేఫర్లతో ఉత్పత్తి చేస్తున్నట్టు కంపెనీ వివరించింది.

ఈ ప్లాంట్‌లో ఏటా 750 మెగావాట్ల సోలార్ సెల్స్, 750 మెగావాట్ల సోలార్ మాడ్యూల్స్‌ను చేయగలిగిన సామర్థ్యం ఉందని కంపెనీ తెలిపింది. దీని ద్వారా కంపెనీ ఉత్పత్తి సామర్థ్యం మూడింతలవుతుందని కంపెనీ తెలిపింది. కొత్త ప్లాంట్‌లో అధిక నాణ్యత కలిగిన మేడ్ ఇన్ ఇండియా మాడ్యూల్స్ ఉత్పత్తి జరుగుతుందని, కేంద్రం చేపట్టిన ఆత్మ నిర్భర భారత్‌ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే లక్ష్యంతో కంపెనీ కార్యకలాపాలు నిర్వహిస్తుందని పేర్కొంది. త్వరలో అమెరికా మార్కెట్లకు కూడా ఎగుమతులను నిర్వహించడంపై దృష్టి సారించనున్నట్టు కంపెనీ వెల్లడించింది. ‘కొత్త ప్లాంట్ ప్రారంభం ద్వారా తమ వినియోగదారులకు అందించే ఉత్పత్తి పోర్ట్‌ఫోలియో మరింత బలోపేతం చేయనున్నామని’ ప్రీమియర్ ఎనర్జీస్ వ్యవస్థాపకుడు, ఏండీ చిరంజీవి సలూజ చెప్పారు.

Next Story

Most Viewed