ప్రీతి జింటా తన సొంత పిల్లలకు తల్లి కావడానికి ముందు 34 మంది పిల్లలను దత్తత తీసుకుంది

by Daayi Srishailam |   (  Updated:2025-06-07 06:50:54  IST  )

34 మంది పిల్లలకు తల్లి

ప్రీతి జింటా తన సొంత పిల్లలకు తల్లి కావడానికి ముందు 34 మంది పిల్లలను దత్తత తీసుకుంది
X

ప్రీతి జింటా అంటే..

ఐపీఎల్ గుర్తొస్తుంది.

అదీ కాదంటే..

బాలీవుడ్ సినిమాలు గుర్తొస్తాయి.

కానీ..

వీటన్నింటికంటే ఆమె గొప్ప మానవతా వాది.

ఐపీఎల్ ముగిసిన నేపథ్యంలో..

ప్రీతి జింటా హెల్పింగ్ నేచర్ గురించి సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.

- దిశ, ఫీచర్స్

బాలీవుడ్‌లో తన అందం.. నటనతో అభిమానుల గుండెల్లో స్థానం సంపాదించిన ప్రీతి జింటా కేవలం సినీ తారగానే కాకుండా సామాజిక సేవలోనూ ముందుండి ఆదర్శంగా నిలుస్తోంది. అనాథలకు అమ్మగా మారి తనలోని మరో కోణాన్ని ఆవిష్కరించింది.

34 మంది బాలికలకు..

ప్రీతి జింటా తన 34 ఏళ్ల వయసులో రిషికేశ్‌లోని "మదర్ మిరాకిల్ ఆశ్రమం" నుంచి 34 మంది బాలికలను దత్తత తీసుకుంది. ఈ నిర్ణయం ఆమె జీవితంలో ఒక మైలురాయి. ఆడపిల్లలు ఎదుర్కుంటున్న కష్టాలు.. భ్రూణ హత్యల వార్తలు ఆమెను తీవ్రంగా కలచివేశాయి. అందుకే ఎవరూ లేరు అని బాధపడుతున్న బాలికలకు మెరుగైన జీవితం ఇవ్వాలని నిశ్చయించుకుంది. దత్తత తీసుకున్న 34 మంది బాలికలకు తన సొంత కూతుర్లలా చదువు.. ఆహారం.. బట్టలు.. ఆరోగ్య సంరక్షణ వంటి పూర్తి అవసరాలను బాధ్యతగా తీసుకుంది.

తల్లి కాకముందే..

మదర్ మిరాకిల్ ఆశ్రమం నుంచి 34 మంది బాలికలను దత్తత తీసుకునే నాటికి ప్రీతి జింటా ఇంకా తల్లి కాలేదు. తనకు పుట్టబోయే బిడ్డతో సమానంగా దత్తత తీసుకున్న పిల్లలకు అన్నీ సమకూరుస్తోంది. వాళ్లతో రోజూ టచ్‌లో ఉంటుంది. ఏం చేస్తున్నారు.. ఎలా చదువుతున్నారు అని రెగ్యులర్‌గా ఆరా తీస్తుంది. సంవత్సరంలో రెండు మూడుసార్లు ప్రత్యక్ష్యంగా వాళ్లను కలుస్తుంది. "పిల్లల ఉత్సాహభరితమైన మాటలు.. చిరునవ్వులు నా గుండెను నింపేస్తున్నాయి. వారు నా పిల్లలు.. వారికి నేనున్నాను" అని అంటోంది ప్రీతి జింటా.

వీరనారీల సాధికారత..

ప్రీతి సామాజిక సేవలో చురుగ్గా ఉంటుంది. హ్యుమానిటేరియన్ కార్యక్రమాల ద్వారా అణగారిన వర్గాల మహిళలు.. పిల్లలకు సాయం చేస్తోంది. 2025 మేలో "పంజాబ్ కింగ్స్ కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ" (సీఎస్ఆర్) నిధుల నుంచి "ఆర్మీ వైవ్స్ వెల్ఫేర్ అసోసియేషన్"కు రూ.1.10 కోట్ల విరాళంగా ఇచ్చింది. ఈ నిధులు వీరనారీల సాధికారత.. వారి పిల్లల చదువులకు ఉపయోగపడతాయి. ఆడ శిశు భ్రూణహత్యలు.. అనాథ బాలికల కష్టాలు చూసి చలించిపోతుంది ప్రీతి. ఆడపిల్లలకు మెరుగైన భవిష్యత్ ఇవ్వాలన్న లక్ష్యంతోనే బాలికల్ని దత్తత తీసుకుంది.

జీవితం నేర్పిన పాఠం..

13 ఏళ్ల వయసులో ప్రీతిజింటా తండ్రి దుర్గానంద్ జిటా కారు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. అప్పుడామె తల్లి బాధ వర్ణనాతీతం. తల్లి బాధను చూస్తూ పెరిగిన ప్రీతి.. సాటి మహిళల పట్ల సానుభూతిగా ఉండేలా ప్రేరేపించాయి. 2016లో అమెరికన్ వ్యాపారవేత్త జీన్ గుడ్ఎనఫ్‌ను వివాహం చేసుకొని లాస్ ఏంజిల్స్‌లో స్థిరపడ్డ ప్రీతి 2021లో జై.. జియా అనే కవలలకు సరోగసీ ద్వారా తల్లి అయ్యింది. తన కవల పిల్లల అవసరాలకు ఏవిధమైన సౌకర్యాలు కల్పిస్తుందో.. దత్తత పిల్లలకూ అవే సమకూర్చాలని నిర్ణయించుకుంది. జీవితం నేర్పిన పాఠంతో.. ఎందరో జీవితాల్లో వెలుగులు నింపుతోంది.

Next Story