మళ్లీ మొదటికొచ్చిన పీఆర్సీ కథ

by  |
మళ్లీ మొదటికొచ్చిన పీఆర్సీ కథ
X

దిశ, తెలంగాణ బ్యూరో : వేతన సవరణ కథ మళ్లీ మొదటికొచ్చింది. ఇప్పటి వరకు ఫిట్‌మెంట్‌పై సాగదీస్తే… ప్రస్తుతం ఎంత ఖర్చు అవుతుందో… ఎంత భారం పడుతుందనే అంశాలపై తిరిగి చర్చలు సాగించేందుకు సీఎస్​ఆధ్వర్యంలోని త్రిసభ్య కమిటీ నిర్ణయం తీసుకుంది. దీంతో పీఆర్సీ వ్యవహారం ఇప్పట్లో తేలేలా లేదనే విమర్శలు వస్తున్నాయి. నెలకుపైగా సాగుతున్న ఈ వ్యవహారం ఇంకెన్ని రోజులు సాగదీస్తారనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అధికారులే జాప్యం చేస్తున్నారా? లేక సీఎం కేసీఆర్ డైరెక్షన్‌లో ఉద్దేశపూర్వకంగా సాగదీస్తున్నారా? అని ఉద్యోగ సంఘాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి.

ఇంకెన్ని చర్చలు?

వేతన సవరణ ఫిట్‌మెంట్​పై వివిధ ఉద్యోగ సంఘాలతో మళ్లీ చర్చించేందుకు షెడ్యూల్ రూపొందించాలని సీఎస్ సోమేష్​కుమార్​సోమవారం ఆదేశాలిచ్చారు. ఉద్యోగ సంఘాలు చేసిన అభ్యర్ధనలను సమగ్రంగా పరిశీలించి ఆర్థిక ప్రభావాన్ని అంచనా వేయాలని ఆర్ధిక శాఖకు త్రిసభ్య కమిటీ తరుపున సూచించారు. ఉద్యోగుల సిఫారసులపై సీఎస్ నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ సోమవారం బీఆర్​కే భవన్‌లో సమావేశమైంది. పీఆర్సీపై ఇప్పటి వరకు ఉద్యోగ సంఘాల నుంచి అందుకున్న విజ్ఞప్తులపై, ప్రభుత్వంపై పడే ఆర్థిక ప్రభావాన్ని కమిటీ చర్చించింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు… కేంద్ర బడ్జెట్ గురించి, వచ్చే ఐదేండ్లకు రాష్ట్రానికి వర్తించే 15వ ఆర్థిక సంఘం సిఫారసుల గురించి వివరించారు. బడ్జెట్‌లో తెలంగాణకు సంబంధించిన అంశాలను సైతం చర్చించారు. దీంతో పీఆర్సీ అంశం ఇప్పట్లో తేలేలా లేదని స్పష్టమవుతోంది. ఇప్పటికే దాదాపు గుర్తింపు పొందిన 14 ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల తరుపున ప్రతినిధులతో త్రిసభ్య కమిటీ చర్చించింది. వాస్తవంగా త్రిసభ్య కమిటీని నియమించడం అవసరం లేదంటూ ఉద్యోగ సంఘాలు ముందుగానే చెప్పాయి. పీఆర్సీ నివేదికను ఇచ్చిన తర్వాత ఫిట్‌మెంట్‌పై సీఎం కేసీఆర్​నిర్ణయం తీసుకుంటారని, కమిటీ అంటే మళ్లీ కాలయాపన చేయడమేననే ఆరోపణలు వచ్చాయి. అయినా త్రిసభ్య కమిటీ చర్చలు మొదలుపెట్టింది.

అనేక అనుమానాలు

త్రిసభ్య కమిటీ చర్చల్లోనూ ఉద్యోగ సంఘాలు వినతులకే పరిమితమయ్యాయి. ముందుగా టీఎన్జీఓ, టీజీఓ, సచివాలయ ఉద్యోగ సంఘాల నుంచి చర్చలు మొదలయ్యాయి. మూడు, నాలుగు రోజుల పాటు దాదాపు 14 సంఘాలతో సమావేశమయ్యారు. గతంలో పీఆర్సీ కమిషన్‌కు ఇచ్చినట్టుగానే ఇప్పుడు సైతం త్రిసభ్య కమిటీకి వినతులిచ్చారు. కమిషన్​సూచించిన ఫిట్‌మెంట్‌పై ఉద్యోగ సంఘాలను బుజ్జగించేందుకు సీఎస్​ఆధ్వర్యంలోని కమిటీ ప్రయత్నాలు చేసిందని సమాచారం. కానీ ఉద్యోగులు ఇప్పటికే నిరసనలు చేయడంతో పాటు ఉద్యోగ సంఘాల జేఏసీపై సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తక్కువ ఫిట్‌మెంట్‌కు ఒప్పుకోవడం లేదంటూ జేఏసీ స్పష్టం చేసింది. ఇప్పటి వరకు ఉద్యోగ సంఘాలు ఇచ్చిన వినతులు కాదంటూ మళ్లీ కొత్తగా చర్చలకు షెడ్యూల్​ఖరారు చేయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చర్చల పేరుతో ప్రభుత్వం కాలయాపన చేస్తోందని విమర్శలు వస్తున్నాయి. ఇలా చర్చించుకుంటూ పోతే ఇంతలో ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్​వస్తే ఈ విషయాన్ని పక్కన పడేస్తారని పలువురు అభిప్రాయపడుతున్నారు.

వ్యూహాత్మకంగానే..

పీఆర్సీ నివేదిక, ఫిట్‌మెంట్​పెంపుపై ప్రభుత్వం వ్యూహాత్మకంగానే కదులుతోందని ఉద్యోగ సంఘాలు విమర్శిస్తున్నాయి. కమిషన్​తక్కువ సూచించినా సీఎం కేసీఆర్​25 నుంచి 30 శాతం ఫిట్‌మెంట్​ఇస్తారని కొన్ని ఉద్యోగ సంఘాలతో వ్యూహాత్మకంగా ప్రచారం చేస్తున్నాయని విమర్శలు వస్తున్నాయి. దీంతో ప్రభుత్వం సానుకూలంగా ఉందనే అంశాన్ని ఉద్యోగుల్లోకి తీసుకువెళ్లేందుకు ప్లాన్​చేస్తున్నారని, ఈ సమయంలో ఎన్నికల నోటిఫికేషన్ వస్తే ఫిట్‌మెంట్​పెంపు ఆశతో ఉద్యోగులు అండగా ఉంటారని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం. ఇలా ఎమ్మెల్సీ ఆ తర్వాత సాగర్ ఉప ఎన్నిక, కార్పొరేషన్ల ఎన్నికలతో కొన్ని నెలలు సాగదీస్తారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.



Next Story

Most Viewed