అక్కడి ప్రజలకు కరెంట్ కష్టాలు తప్పేది ఎన్నడో..

by  |
Power1
X

దిశ, కాటారం: మండల కేంద్రమైన కాటారంలో కరెంటు ఎప్పుడు ఉంటుందో పోతుందో తెలియని పరిస్థితి ఉంది. మండలంలో 132, 32,11 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్‌లు ఉన్నప్పటికీ విద్యుత్ సరఫరా తీవ్ర అస్తవ్యస్తంగా మారింది. కాటారంలో కొన్ని రోజులుగా కరెంటు సరఫరా పై ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. కాటారం మండలం లోని గ్రామాల్లో విద్యుత్ సరఫరాలో ప్రణాళిక లేకుండా అప్రకటిత విద్యుత్ కోతలు అమలు చేస్తున్నారు. మండలంలో కరెంటు ఎప్పుడు ఉంటుందో పోతుందో తెలియని పరిస్థితి. ఫలితంగా ప్రజలు తీవ్ర కష్టాలు ఎదుర్కొంటున్నారు. విద్యుత్ శాఖ పనితీరుపై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఫ్యూషన్ ఆఫ్ కాల్స్ పేరుతో ఇష్టం వచ్చినప్పుడు విద్యుత్ సరఫరాను నిలిపివేసి ఇష్టానుసారం పునరుద్ధరణ చేస్తుండటంతో చిన్న పరిశ్రమల వినియోగదారులు వ్యాపారం లేక నానా పాట్లు పడుతున్నారు. గ్రామాల్లోని విద్యుత్ సిబ్బందిని కేటాయించిన గ్రామంలో నివాసం ఉండకపోవడంతో విద్యుత్ సరఫరాలో అవాంతరాలు ఏర్పడితే పునరుద్ధరణ కష్టతరంగా మారింది.

కరెంటు సరఫరా పై ఎమ్మెల్యేకు విన్నవించిన తహసీల్దార్

కాటారం మండల కేంద్రంలో విద్యుత్ సరఫరా లోపభూయిష్టంగా ఉందని ఫలితంగా మండల కార్యాలయంలో జరిగే భూమి రిజిస్ట్రేషన్ లతోపాటు ఇతర కార్యక్రమాలకు తీవ్ర అవరోధం ఏర్పడుతుందని మాజీ మంత్రి మంథని శాసనసభ్యులు దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు మండల తహసీల్దార్ శ్రీనివాస రావు విన్నవించారు. విద్యుత్ సరఫరా విషయమై సంబంధిత అధికారులకు దృష్టికి తీసుకొచ్చిన ప్పటికీ సమస్య పరిష్కారం కావడం లేదని తహసీల్దార్ ఎమ్మెల్యే దృష్టికి తీసుకు వచ్చారు. విద్యుత్ సరఫరా మెరుగు పరిచే లా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

ప్రజలకు దూరంగా విద్యుత్ కార్యాలయం

కాటారం మండల కేంద్రంలో ప్రజలకు అందుబాటులో విద్యుత్ శాఖ కార్యాలయం లేకపోవడంతో ప్రజలు అవసరాలపై ఆఫీస్ కు వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాటారం కు రెండు కిలోమీటర్ల దూరంలో గల విద్యుత్ సబ్ స్టేషన్‌లో ఆఫీస్ ను ఏర్పాటు చేశారు. గతంలో గారెపల్లి గ్రామంలో ఆఫీస్ ఉండడంతో మండల ప్రజలకు అందుబాటులో ఉండేది. విద్యుత్ అవసరాల నిమిత్తం ఆఫీస్ కి వెళ్తే సిబ్బంది అందుబాటులో ఉండటం లేదనే ఆరోపణలున్నాయి.

వేర్వేరు విద్యుత్ సరఫరా ఫీడర్ ను ఏర్పాటు చేయాలి

మండల కేంద్రమైన కాటారం,గారెపల్లి గ్రామాలకు సబ్ స్టేషన్ నుండి విద్యుత్ సరఫరా చేయడంలో ఒకే ఫీడర్ ఉండటంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాటారం గారెపల్లి గ్రామాలకు విద్యుత్ సరఫరా లో ఏ చిన్న అంతరాయం కలిగి నా,ఫీజ్ ఆఫ్ కాల్ కైనా రెండు గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారు. గారెపల్లి గ్రామంలో చిన్న తరహా పరిశ్రమలు,వాణిజ్య సముదాయాలు ఎక్కువగా ఉన్నాయి. ఏ చిన్న సమస్యకైనా సబ్ స్టేషన్ నుంచి కరెంటు సరఫరా కట్ చేస్తుండడంతో రెండు గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వినియోగదారుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక ఫీడర్లు ఏర్పాటు చేయాలని విద్యుత్ శాఖ డీ ఈ ఎస్ ఈ లకు మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు.


Next Story

Most Viewed