'విద్యుత్ రంగాన్ని ప్రైవేట్​పరం చేస్తే అంధకారమే'

by  |
విద్యుత్ రంగాన్ని ప్రైవేట్​పరం చేస్తే అంధకారమే
X

దిశ, తెలంగాణ బ్యూరో: కేంద్రం ఇప్పటికే ఒక్కొక్కటిగా ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తోందని, విద్యుత్​రంగాన్ని సైతం ప్రైవేట్​పరం చేస్తే భవిష్యత్​ అంధకారమేనని 1104 విద్యుత్​ సంఘం నాయకులు విమర్శలు చేశారు. కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన రైతు వ్యతిరేక, కార్మిక, ప్రజా వ్యతిరేక, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ విధానాలను నిరసిస్తూ జాతీయ కిసాన్ మోర్చా ‘భారత్ బంద్’కు పిలుపునివ్వగా.. 1104 విద్యుత్​ యూనియన్ సంఘం ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన విరామ సమయంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు యూనియన్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఎన్ పద్మా రెడ్డి, సాయి బాబు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.

దేశానికి వెన్నెముకైన రైతులను కార్పొరేట్ శక్తుల దగ్గర మోకరిల్లే విధంగా నూతన రైతు చట్టాలను తీసుకురావడం ఈ దేశ మనుగడకే ప్రమాదమని, దానిని రద్దు చేసి రైతులను కాపాడాలన్నారు. వ్యవసాయ రంగం సంక్షోభంలోకి వెళితే ఆకలి కేకలతో దేశం అల్లాడుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ కారణంగా దేశంలో సామాజిక న్యాయం కొరవడుతుందన్నారు. కావున తక్షణమే ఈ నూతన చట్టాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్​ చేశారు. కార్మిక చట్టాలను నాలుగు కోడ్ లుగా విభజించి కార్మిక రంగాన్ని సంక్షోభంలోకి నెట్టే చర్యలను విరమించుకోవాలన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. లేదంటే భవిష్యత్ లో ఎంతటి ఉద్యమానికైనా వెనుకాడబోమని హెచ్చరించారు.



Next Story