వింత రోగం.. నాలుగు వేల నాటుకోళ్లు మృతి

by  |
వింత రోగం.. నాలుగు వేల నాటుకోళ్లు మృతి
X

దిశ ప్రతినిధి, కరీంనగర్ : పెద్దపల్లి జిల్లాలో మరోసారి నాటు కోళ్లు పెద్ద సంఖ్యలో అకారణంగా మరణించడంతో స్థానికంగా కలకలం సృష్టిస్తోంది. ఉన్నట్టుండి వేల సంఖ్యలో కోళ్లు మరణించడంతో పౌల్ట్రీ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని కాల్వశ్రీరాంపూర్ మండల కేంద్రంలో మంగళవారం వింత రోగంతో నాలుగు వేల నాటు కోళ్లు మృతి చెందాయి. కాల్వ శ్రీరాంపూర్ కు చెందిన స్వామి అనే రైతు నాలుగు వేల కోళ్లను పెంచుతున్నాడు. మంగళవారం ఉదయం కోళ్లకు దాణా వేసిన తర్వాత వాటిని ఫామ్ లో వదిలిపెట్టాడు. రెండు గంటల తరువాత ఒకదాని తర్వాత ఒకటి వరుసగా నాలుగు వేల కోళ్లు మృతి చెందాయి.

దీంతో తనకు 20 లక్షల నష్టం వాటిల్లినట్లు స్వామి తెలిపారు. అయితే కోళ్ల మృతి కారణాలు తెలియరాలేదు. వింత రోగం సోకి కోళ్లు చనిపోయాయని అంటున్నారు. ఉన్నట్టుండి కోళ్లు చనిపోవడానికి బర్డ్ ఫ్లూ సోకిందా లేక ఎండలు బాగా ముదరడంతో వేడికి తట్టుకోలేకపోయాయా అన్నది అంతు చిక్కకుండా తయారైంది. ఇటీవల ఇదే మండలంలో వందల సంఖ్యలో చనిపోయిన కోళ్లు స్థానిక ఎస్సారెస్పీ కెనాల్‌లో ప్రత్యక్ష్యం అయ్యాయి. తాజాగా మరోసారి కోళ్లు చనిపోవడం పౌల్ట్రీ రైతులను ఆందోళనకు గురి చేస్తోంది.



Next Story

Most Viewed