విద్యుత్ పునరుద్ధణ తర్వాతే సాఫీగా సీఐడీ విచారణ !

by  |
విద్యుత్ పునరుద్ధణ తర్వాతే సాఫీగా సీఐడీ విచారణ !
X

దిశ, క్రైమ్‌బ్యూరో: శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదంపై సీఐడీ డైరెక్టర్ జనరల్ గోవింద్ సింగ్, డీఐజీ సుమతి నేతృత్వంలో విచారణ కొనసాగుతోంది. ప్రస్తుతం అండర్ గ్రౌండ్‌ పవర్ హౌస్‌లోకి భారీగా ఊటనీరు చేరుతుండటంతో మోటార్ల ద్వారా ఎత్తిపోస్తున్నారు. ఘటనా స్థలంలో విద్యుత్ సరఫరా లేకపోవడంతో విద్యుత్ వైర్లను తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. వేడి తీవ్రత అధికంగా ఉన్నందున సీఐడీ అధికారులు దర్యాప్తు నిమిత్తం లోపలికి వెళ్ళలేకపోయారు. ఈ పరిస్థితులు సీఐడీ విచారణకు ఆటంకంగా మారాయి. అయినా సీఐడీ బృందం తమ విచారణను సోమవారం కొనసాగించింది. కొన్ని ప్రాంతాల్లో కాలిన పదార్థాల నుంచి సీఐడీ బృందం శాంపిల్స్‌ను సేకరించి ఫోరెనిక్స్ ల్యాబ్‌కు పంపించారు.

ఈ ఘటనపై మూడ్రోజులుగా పలువురి అధికారుల స్టేట్మెంట్‌ను సీఐడీ రికార్డు చేసింది. జెన్‌కో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారి స్టేట్‌మెంట్‌లతో పాటు మరికొందరి నుంచి వివరాలను సేకరిస్తోంది. అయితే, ఈ ప్రమాదం షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా.., ఇతర కారణాల వల్ల ఏమైనా జరిగిందా..? మానవ తప్పిదమా.. లేదంటే సాంకేతిక లోపమా అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. మళ్లీ విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించాలంటే మరింత సమయం పట్టే అవకాశం ఉంది. దీంతో విద్యుత్ పునరుద్ధరణ తర్వాత సీఐడీ అధికారులు మరోసారి ప్రమాద స్థలాన్ని సందర్శించే వీలుంది. సీఐడీ అడిషనల్ డీజీ గోవింద్ సింగ్, డీఐజీ సుమతి ఆదివారం సాయంత్రమే హైదరాబాద్‌కు చేరుకున్నారు. సోమవారం మిగతా సభ్యులతో కోఆర్డినేట్ చేస్తూ వివరాలు, విచారణ అంశాలకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకుంటున్నారు.



Next Story

Most Viewed