వరిగడ్డిని కాల్చొద్దు.. ఆ పరిస్థితి తెచ్చుకోవద్దు: పీసీబీ హెచ్చరిక

by  |
వరిగడ్డిని కాల్చొద్దు.. ఆ పరిస్థితి తెచ్చుకోవద్దు: పీసీబీ హెచ్చరిక
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ర్ట వ్యాప్తంగా వరిగడ్డిని తగలపెట్టకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్లదేనని పీసీబీ(పొల్యూషన్​కంట్రోల్​ బోర్డు) తేల్చి చెప్పింది. ఇప్పటికే వరి సాగు పెరగడంతో దాన్య సేకరణ తర్వాత రైతులు ఆ గడ్డిని కాల్చి వేస్తున్నట్లు తమ పరిశీలనలో తేలిందని పీసీబీ వెల్లడించింది. ముఖ్యంగా ఆదిలాబాద్, బాన్సువాడ, వరంగల్ ప్రాంతాల్లో ఈ పరిస్థితులు ఎక్కువగా ఉన్నట్లు అధికారులు వివరించారు. దీన్ని నియంత్రించకపోతే గాలి కాలుష్యం విపరీతంగా పెరిగే అవకాశం ఉన్నదని హెచ్చరించింది. వ్యవసాయ శాఖ, జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో రైతులకు అవగాహన కల్పించాలని పొల్యూషన్ కంట్రోల్​బోర్డు అగ్రికల్చర్​కమిషనర్‌కు లేఖ రాసింది.

ఆ​ పరిస్థితులు తెచ్చుకోవద్దు..

పంటకోత అనంతరం వ్యర్థాలను వాడుకోవడంలో ఢిల్లీ, హార్యానా, పంజాబ్​తదితర రాష్ర్టాలు విఫలం కావడంతోనే అక్కడ గాలి కాలుష్యం పెరిగిందని పీసీబీ పేర్కొన్నది. అప్రమత్తంగా లేకపోతే మన రాష్ట్రంలోనూ అలాంటి పరిస్థితులు వచ్చే అవకాశం ఉందని సూచించింది. దీంతో ప్రజారోగ్యానికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉన్నదని నొక్కి చెప్పింది. వాస్తవానికి తెలంగాణలో వరి గడ్డిని పశుగ్రాసానికి వాడుతుంటారు. కానీ, ఇటీవల కాలంలో పశుదాన కోసం రైతులు ప్రత్యేక గడ్డి పంటను వేస్తున్నారు. దీంతో వరి గడ్డి వినియోగం తగ్గింది. ఎకరం వరి సాగు చేస్తే 20 క్వింటాళ్ల దిగుబడి వస్తే, దాదాపు నాలుగు టన్నుల ఎండు గడ్డి వస్తోంది. ఈ లెక్కన రాష్ట్రంలో వరిగడ్డి ఉత్పత్తి కోట్ల మెట్రిక్​టన్నుల్లోనే ఉంటోంది. మరోవైపు గత పదేళ్లతో పోల్చితే పశువుల సంఖ్య కూడా తగ్గింది. దీంతో సాగైన వరి గడ్డిని వాడకం తగ్గి పంటపొలాల్లోనే తగలబెట్టే పరిస్థితి వచ్చింది. ఇదిలా ఉండగా ఒక హెక్టార్​వరి సాగుతో 30 వేల కిలోల కార్బన్ డయాక్సైడ్ విడుదలవుతోందని సెంటర్ ఫర్​సస్టెయినబుల్ అగ్రికల్చర్​చేసిన సర్వేలో వెల్లడైంది.

శ్వాస సంబంధిత సమస్యలు పెరుగుతాయి..

గాలి కాలుష్యం పెరిగితే శ్వాస సంబంధిత సమస్యలు పెరిగే ప్రమాదం ఉన్నదని పబ్లిక్​హెల్త్​డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ఈ మధ్యకాలంలో అలాంటి కేసులు ఎక్కువగా వస్తున్నట్లు చెప్తున్నరు. అంతేగాక ఎయిర్​ పొల్యూషన్‌తో గర్భంలో ఉన్న పిండంపై ప్రభావం పడే చాన్స్​ ఉందని పేర్కొన్నారు. దీంతోనే తక్కువ బరువు ఉన్న పిల్లలు పుడుతున్నట్లు వైద్యులు వెల్లడించారు. మరోవైపు ఊపిరితిత్తుల సమస్యలతో పాటు, హృదయ సంబంధిత వ్యాధులూ పెరుగుతాయని డాక్టర్లు చెప్తున్నారు.

బయో సీఎన్‌జీ వైపు మొగ్గు చూపాలి..

వరి గడ్డితో బయో సీఎన్‌జీని ఉత్పత్తి చేయొచ్చు. పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో ఈ పద్ధతిని ఇటీవల కాలంలో అమలు చేస్తున్నారు. ఈ విధానంలో ఒక్క మెట్రిక్ టన్ను వ్యవసాయ వ్యర్థాల నుంచి 100 కిలోల సీఎన్‌జీ ఉత్పత్తి అవుతోందని ఓ అధికారి దిశకు తెలిపారు. ఇందులో ఒక కిలో సీఎన్‌జీ తయారీకి రూ.15 నుంచి రూ. 20 ఖర్చవుతోంది. ఈ ప్లాంట్లలో ఉత్పత్తి అయ్యే గ్యాస్ మొత్తా న్ని ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థలు లీటరు కు రూ. 46కు కొనుగోలు చేస్తాయని ఇప్పటికే కేంద్రం ప్రకటించింది. అంటే టన్నుకు రూ.46 వేల ఆదాయం వచ్చే అవకాశాలున్నాయి. దీంతో అలాంటి ప్రణాళికలను తయారు చేస్తే రైతులకూ మేలు జరుగుతుందని సైంటిస్టులు పేర్కొంటున్నారు. మరోవైపు వరి గడ్డితో కాగితం, పేపర్​ ప్లేట్స్, కప్పులు కూడా తయారు చేయొచ్చు. దీని ద్వారా కూడా కొంత వరకు ఆదాయం వస్తుందని స్పష్టం చేశారు.


Next Story

Most Viewed