రేవంత్ రెడ్డి దొంగ జపం చూస్తుంటే నవ్వొస్తుంది: షర్మిల

by Disha Web Desk 2 |
రేవంత్ రెడ్డి దొంగ జపం చూస్తుంటే నవ్వొస్తుంది: షర్మిల
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఏ ఎండకు ఆ గొడుగు పట్టే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి వైఎస్సార్ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు షర్మిల ఫైర్ అయ్యారు. మహానేత వైఎస్సార్ పాలన తీసుకువస్తాననంటూ ఓటుకు నోటు దొంగ కొత్త జపం చేయడం హాస్యాస్పదంగా ఉందని ధ్వజమెత్తారు. సోమవారం రేవంత్ రెడ్డిపై షర్మిల వరుస ట్వీట్లతో విరుచుకుపడ్డారు. చంద్రబాబు విసిరిన ఎంగిలి మెతుకుల కోసం ఆనాడు వైఎస్సార్‌ను ఆజన్మ శత్రువు అన్నది ఈ దొంగ కాదా అని ప్రశ్నించారు. రాజశేఖర్ రెడ్డి మరణిస్తే పావురాలగుట్టలో పావురం అంటూ హేళన చేసింది ఈ దగా కోరు కాదా అని నిలదీశారు. పులి తోలు కప్పుకున్నంత మాత్రాన నక్క పులి కాదని, రేవంత్ రెడ్డి అద్దెకు తెచ్చుకున్న ఉద్దెర లీడర్ లాంటివాడని ఎద్దేవా చేశారు.

పులి తోలు కప్పుకున్నంత మాత్రానా నక్క పులి కాదు. కారులో తిరుగుతూ ఆట విడుపులా పాదయాత్ర చేస్తూ పాదయాత్ర అనే పదాన్నే రేవంత్ రెడ్డి అపహాస్యం చేస్తున్నాడని ఇలాంటి ప్రబుద్ధుడు ఊరూరా తిరిగి పొర్లు దండాలు పెట్టినా జనం నమ్మరన్నారు. ఓటుకు నోటు దొంగను జనాలు నమ్మడం లేదన్న షర్మిల.. వైఎస్సార్ పేరును వాడుకుంటున్న రేవంత్‌కు వైఎస్సార్ అభిమానులే బుద్ధి చెబుతారన్నారు. వైఎస్సార్ సంక్షేమ పాలన కోసం పుట్టిన ఏకైక పార్టీ వైఎస్సార్ తెలంగాణ పార్టీ అని, ఆ మహానేత ఆశయ సాధన కోసం 3800 కిలోమీటర్ల పాదయాత్ర చేసి ప్రజా సమస్యలపై అలుపెరగని పోరాటం చేసింది వైఎస్సార్ బిడ్డ మాత్రమే అన్నారు.


Next Story