కాంగ్రెస్ కు ప్రజలు ఓటే వేయనప్పుడు ఈసీని నిందించడం ఎందుకు?.. కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్

by Dishafeatures2 |
కాంగ్రెస్ కు ప్రజలు ఓటే వేయనప్పుడు ఈసీని నిందించడం ఎందుకు?.. కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్
X

దిశ, వెబ్ డెస్క్: కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగం సంస్థలను దుర్వినియోగం చేస్తోందంటూ కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్ సోనియా గాంధీ చేసిన వ్యాఖ్యలను కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఖండించారు. కాంగ్రెస్ కు అసలు ప్రజలు ఓటే వేయనప్పుడు ఈసీని నిందించడం ఎందుకు అంటూ కౌంటర్ వేశారు. చత్తీస్ గఢ్ లోని రాయపూర్ లో జరుగుతున్న కాంగ్రెస్ పార్టీ 85వ ప్లీనరీ సెషన్ లో సోనియా గాంధీ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఈసీ, ఈడీ, సీబీఐ వంటి రాజ్యాంగ సంస్థలను మోడీ ప్రభుత్వం రాజకీయ స్వార్ధానికి వాడుకుంటోందని విమర్శించారు. అయితే తాజాగా సోనియా గాంధీ వ్యాఖ్యలను కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ తిప్పికొట్టారు. సోనియా గాంధీ ప్రసంగంలో నిరాశ, నిస్పృహలు కనిపించాయని ఎద్దేవా చేశారు. వరుసగా రెండు ఎన్నికల్లో ప్రజలు తిరస్కరించినా వాళ్లలో ఎలాంటి కనువిప్పు కలగలేదని విమర్శించారు.

ప్రధాని మోడీ చేసిన అభివృద్ధిని సోనియా, ఆమె పార్టీ నాయకులు గుర్తించడానికి సిద్ధంగా లేరని అన్నారు. మోడీ నాయకత్వంలో ఎస్సీలు, ఎస్టీలు, మహిళలు, మధ్యతరగతి ప్రజలకు ఎన్నో అభివృద్ధి ఫలాలు అందాయన్నారు. కేంద్ర ప్రభుత్వంపై సోనియా చేసిన ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ప్లీనరీలో ఆత్మపరిశీలన కరువైందని అన్నారు. కాంగ్రెస్ పాలనలో జరిగిన అవినీతి, క్రోనిక్ క్యాపిటలిజం, కుటుంబ పాలన వంటివి ఆ పార్టీ నేటి దయనీయ స్థితికి కారణమయ్యాయని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ అన్నారు.

Next Story

Most Viewed