తెలంగాణ నుంచి మరొకరికి కేంద్ర మంత్రి పదవి..?

by Disha Web Desk |
తెలంగాణ నుంచి మరొకరికి కేంద్ర మంత్రి పదవి..?
X

దిశ, డైనమిక్ బ్యూరో: త్వరలో కేంద్ర మంత్రివర్గ విస్తరణపై జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ నుంచి కేంద్ర మంత్రి పదవి ఎవరికి దక్కబోతోందనే టాపిక్ హాట్ హాట్‌గా సాగుతోంది. రాష్ట్రం నుంచి ఇప్పటికే కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఉన్నప్పటికీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా మరొకరికి సెంట్రల్ కేబినెట్‌లోకి తీసుకునే అవకాశం ఉందనే ప్రచారం జోరుగా వినిపిస్తోంది. అసలే ఎన్నికల సంవత్సరం కావడం, బీజేపీ జాతీయ నాయకత్వం తెలంగాణపై స్పెషల్ ఫోకస్ పెట్టిన నేపథ్యంలో ఒక వేళ తెలంగాణ నుంచి మరొకరికి అవకాశం కల్పిస్తే ఆ బెర్త్ ఎవరికి దక్కబోతోందనేది ఆసక్తిని రేపుతోంది. రాష్ట్రం నుంచి నలుగురు లోక్ సభ ఎంపీలు ఒకరు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. ఇందులో కిషన్ రెడ్డి ఇప్పటికే కేంద్ర మంత్రిగా కొనసాగుతుండగా రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ విషయంపై జోరుగా చర్చ జరుగుతోంది. అయితే బండి సంజయ్ నేతృత్వంలో పార్టీ పుంజుకుంటోందనే అభిప్రాయం అధిష్టానం దృష్టిలో ఉంది. దీంతో ఆయన్ను ఎన్నికలు పూర్తయ్యే వరకు రాష్ట్ర అధ్యక్షుడిగానే కొసాగించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

బీసీ సామాజిక వర్గానికి అవకాశం కల్పించాలని భావిస్తే నిజామాబాద్ ఎంపీ ధర్మపురి ఎంపీకి అవకాశం దక్కే ఛాన్స్ ఉంది. కవితను ఓడించిన వ్యక్తిగా కేసీఆర్ ఫ్యామిలీకి దీటుగా బదులు ఇస్తారనే అంశాలు అర్వింద్‌కు కలిసి వచ్చేవిగా ఉన్నాయి. ఇక గిరిజన ఆదివాసి సామాజిక వర్గానికి ఛాన్స్ ఇవ్వాలనుకుంటే సోయం బాపురావును బర్త్ కన్ఫార్మ్ కానుంది. ఇటీవల గిరిజన ఆదివాసీ ఓట్లపై బీజేపీ అధినాయకత్వం ఫోకస్ పెట్టింది. రాష్ట్రపతి పదవిని గిరిజన మహిళకు కట్టబెట్టిన సంగతి తెలిసిందే. మరో బీసీ నేత డా.లక్ష్మణ్ యూపీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. సీనియార్టీని అనుసరించి అవకాశం కల్పిస్తే గనుక లక్ష్మణ్ కు కేంద్ర మంత్రి పదవి దక్కే అవకాశాలు ఉన్నాయనే చర్చ జరుగుతోంది. ప్రస్తుతం లక్ష్మణ్ రాజ్యసభ సభ్యుడిగానే కాక బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడిగా, బీజేపీ పార్లమెంటరీ బోర్డులో సభ్యుడిగా, పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ మెంబర్‌గా ఉన్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రివర్గాన్ని విస్తరిస్తే రాష్ట్రం నుంచి ఎవరికి ఛాన్స్ వస్తుందనేది ఉత్కంఠగా మారింది. కాగా త్వరలో ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలే లక్ష్యంగా కేంద్ర మంత్రి వర్గ విస్తరణకు మోడీ, అమిత్ షాలు ప్రణాళికలు వేస్తున్నట్టు చర్చ జరుగుతోంది.

Read more:

బ్రేకింగ్ : గవర్నర్‌పై సర్కార్ యూటర్న్

ముందస్తుకు వెళ్తే కేటీఆర్ ఓడిపోవడం ఖాయం: MP



Next Story