రాజకీయాల్లోకి శశికళ రీఎంట్రీ.. నెచ్చెలి జయంతి రోజున పార్టీ ప్రకటన?

by Naga Rani Yarlagadda |

దివంగత నేత జయలలిత నెచ్చెలి శశికళ మళ్లీ తమిళనాడు రాజకీయాల్లో యాక్టివ్ అయ్యేందుకు వ్యూహరచన చేస్తున్నారు. వారంరోజులుగా ఆమె తన అనుచరులతో వరుసగా సమావేశమవుతుండటం ఇందుకు అద్దం పడుతోంది.

రాజకీయాల్లోకి శశికళ రీఎంట్రీ.. నెచ్చెలి జయంతి రోజున పార్టీ ప్రకటన?
X

దిశ, వెబ్‌డెస్క్: అన్నాడీఎంకే (AIADMK) మాజీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శి, మాజీ ముఖ్యమంత్రి జయలలితకు సన్నిహితురాలు వి.కె. శశికళ గత వారం ప్రారంభించిన తన అనుచరులతో సమావేశాలను ఈ వారం కూడా కొనసాగించనున్నారు. కొత్త రాజకీయ పార్టీ పెట్టేందుకే ఆమె వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. THE HINDUలో పేర్కొన్న దాని ప్రకారం.. 2026 అసెంబ్లీ ఎన్నికల కోసం తన వర్గం వ్యూహాన్ని ఖరారు చేయడమే ఈ చర్చల ప్రధాన ఉద్దేశమని ఆమె అనుచరులు తెలిపారు. ఫిబ్రవరి 18, 2026 వరకు సమావేశాలు నిర్వహించాలని శశికళ నిర్ణయించుకున్నట్లు మాజీ ఎమ్మెల్యే అయిన ఆమె అనుచరుడు వెల్లడించారు. జయలలిత జయంతి (ఫిబ్రవరి 24)కు ముందే పార్టీ పెట్టడంపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ఆమె వర్గం పేర్కొంటోంది.

శశికళతో జరుగుతున్న చర్చల ఉద్దేశాన్ని వివరించిన ఆమె మద్దతుదారుడు.. 2021లో చేసినట్లుగా ఈసారి అసెంబ్లీ ఎన్నికలకు దూరంగా ఉండకూడదని తమ వర్గం భావిస్తున్నట్లు తెలిపారు. ఎం.జి. రామచంద్రన్, జయలలిత సిద్ధాంతాల ప్రకారం పార్టీ వ్యవహారాలు సాగడం లేదని, అందుకే ఎన్నికల బరిలోకి దిగుతూ తమ ఉనికిని చాటుకోవాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు.

మరోఏడాదిపాటు అనర్హత

2017 ఫిబ్రవరిలో అవినీతి కేసులో శశికళకు నాలుగేళ్ల జైలు శిక్ష పడింది. దాంతో ఆమె ఎన్నికల్లో పోటీ చేయడంపై అనర్హత కొనసాగుతోంది. ఈ అనర్హత కాలం వచ్చే ఏడాది ప్రారంభంలో ముగియనుంది. సో.. ఈసారి ఆమె స్వయంగా ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేదు. 2018లో ఆమె మేనల్లుడు టి.టి.వి. దినకరన్ ‘అమ్మ మక్కల్ మున్నేట్ర కజగం’ (AMMK) పార్టీని స్థాపించారు. ఆ సమయంలో బెంగళూరు జైలులో శిక్ష అనుభవిస్తున్న శశికళను ఆ పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. తరువాత దినకరన్ స్వయంగా ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించి, అన్నాడీఎంకే పగ్గాలు చేపట్టేందుకు శశికళ న్యాయపోరాటం కొనసాగిస్తారని ప్రకటించారు. ప్రస్తుతం దినకరన్ ద్రావిడ ప్రధాన పార్టీతో పొత్తు పెట్టుకున్నప్పటికీ, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కె. పళనిస్వామి మాత్రం శశికళ, అలాగే మాజీ సమన్వయకర్త పన్నీర్ సెల్వంలను తమ కూటమిలో చేర్చుకునేందుకు నిరాకరించారు.

తమ వర్గం ఎన్నికల రంగప్రవేశం వల్ల అన్నాడీఎంకే, దాని మిత్రపక్షాల అవకాశాలపై ప్రభావం ఉంటుందా అనే ప్రశ్నకు బదులిచ్చారు. తిరువల్లూరు జిల్లాలో గత ఎన్నికల్లో అన్నాడీఎంకే, దాని మిత్రపక్షాలు 10 నియోజకవర్గాల్లోనూ గణనీయ ఓట్ల తేడాతో ఓడిపోయాయని గుర్తు చేశారు. పార్టీ బలహీనపడిందనే విషయాన్ని ఇది స్పష్టంగా చూపుతుందని, ఈ పరిస్థితిని సరిచేయడానికే తమ వర్గం ఎన్నికల్లో పాల్గొనాలని భావిస్తున్నట్లు తెలిపారు.

Next Story