సమోసాలు మిస్సింగ్.. సీఐడీ విచారణకు ఆదేశం!

by Yella Dhawani Reddy |

సాధారణంగా సీఐడీ (CID) అంటే.. పెద్ద పెద్ద కేసులను మాత్రమే విచారిస్తుంది.

సమోసాలు మిస్సింగ్.. సీఐడీ విచారణకు ఆదేశం!
X

దిశ, వెబ్ డెస్క్: సాధారణంగా సీఐడీ (CID) అంటే.. పెద్ద పెద్ద కేసులను మాత్రమే విచారిస్తుంది. కానీ ఓ రాష్ట్రంలో సమోసాల మిస్సింగ్ కేసులో రంగంలోకి దిగి అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. పైగా ఈ కేసు విచారణకు సీఎం ఆఫీసు నుంచి ఆదేశాలు వచ్చినట్లు సమాచారం. ఈ వింత ఘటన హిమచల్‌ప్రదేశ్‌లో వెలుగుచూసింది. అసలు ఏం జరిగిందో పూర్తి వివరాల్లోకి వెళ్లితే..

హిమాచల్‌ ముఖ్యమంత్రి సుఖ్వీందర్‌ సుఖు గతేడాది ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆ కార్యక్రమంలో భాగంగా సీఎంకు వడ్డించాల్సిన సమోసాలు కనిపించకుండాపోయాయి. దీంతో ఆ సమోసాలు ఏం అయ్యాయని ఏకంగా ఆ రాష్ట్ర సీఐడీ విచారణకు దిగింది. అందరూ తినే సాధారణ సమోసాలే కదా అందులో విచారించాల్సినంతా స్పెషల్‌ ఏముంది అనుకున్నారా? అయితే సీఎం హాజరైన కార్యక్రమంలో అవి మిస్‌ కావడం, పైగా ఆ కార్యక్రమం CID హెడ్‌ క్వార్టర్స్‌లోనే జరగడంతో అధికారులు అలర్ట్ అయ్యారు. సీఐడీ కార్యాలయంలోనే ఎలా మిస్ అవుతాయి? ఎవరు వాటిని దొంగలించారు? అని తెలుసుకోవాలని విచారణ చేపట్టారు. అయితే, ఈ విషయం కాస్తా బయటికి పొక్కటంతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సమోసాల కోసం CID విచారణ చేయడం ఏంటని ప్రజలు, ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి.

అయితే తాము సమోసాల మిస్సింగ్‌పై రాతపూర్వకంగా ఎలాంటి కేసు నమోదు చేయలేదని, ఇది కేవలం CID అంతర్గత వ్యవహారం అని సీఐడీ అధికారులు తెలిపారు. అలాగే ఈ విషయం బయటి ఎలా పొక్కింది? ఎవరో కావాలనే ఈ విషయాన్ని లీక్‌ చేశారంటూ సీఐడీ అధికారులు సీరియస్‌ అయ్యారు. CID అంతర్గత వ్యవహారాన్ని చట్టవ్యతిరేకంగా ఎలాంటి అనుమతి లేకుండా ఎలా లీక్‌ చేస్తారంటూ తాజాగా ఘటనపై FIR నమోదు చేశారు. అలాగే సమోసాల మిస్సింగ్‌పై విచారణ జరపమని సీఎం కార్యాలయం నుంచి ఎవరికి ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని, అది కేవలం సీఐడీ ఇంటర్నల్‌ మ్యాటర్‌ అంటూ సీఎంఓ ఓ ప్రకటనలో పేర్కొంది.

Next Story