YSR కూతురు అని కూడా చూడను.. షర్మిలపై జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు

by Disha Web Desk 2 |
YSR కూతురు అని కూడా చూడను.. షర్మిలపై జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: దివంగత సీఎం రాజేశేఖరరెడ్డి చనిపోయినప్పుడు తానెంతో ఏడ్చానని, ఆయన కోసం తామంతా బయట ఏడుస్తుంటే ఇంట్లో మాత్రం సీఎం ఎవరు కావాలని స్కెచ్ వేశారని టీపీసీసీ చీఫ్ జగ్గారెడ్డి ఫైర్ అయ్యారు. వైఎస్ మీద తమలాంటి వాళ్లకే ప్రేమ ఉందని, షర్మిలకు ఆ ప్రేమే లేదని, పార్టీ మారడంపై కామెంట్​చేసే ముందు చరిత్ర తెలుసుకోవాలని షర్మిలకు సూచించారు. సీఎల్పీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఏపీ సీఎం జగన్, వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు షర్మిలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. టీఆర్ఎస్‌తో పని చేసుకుంటూ ఉన్న తనను పిలిచింది వైఎస్ అని, ఆ సంగతి షర్మిలకు తెల్వదా అని ప్రశ్నించారు. మీ నాయన ఏం చేశాడో తెలుసుకోకుండా మాట్లాడుతున్నవంటూ షర్మిల్‌పై మండిపడ్డారు. వైఎస్​చనిపోయినప్పుడు శవం ముందే సీటు పంచాయతీ పెట్టుకున్నారని సంచనల వ్యాఖ్యలు చేశారు. వైఎస్‌ను అభిమానించే వాళ్లలో తాను ఒక్కడినని, కానీ, తనతోనే ఇవ్వాళ వైఎస్సార్‌ లోపాలు ఎత్తి చూపించేలా చేస్తున్నారని, ఆయన్ను అభిమానించే వాళ్లతోనే తిట్టించే పని పెట్టిందని షర్మిల అని అన్నారు. రాజశేఖరరెడ్డి కూడా పార్టీ మారారని, రెడ్డి కాంగ్రెస్‌లో ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్‌లోకి వచ్చారని, ఈ విషయం షర్మిలకు తెలియనట్టుందన్నారు. వైఎస్ అభిమానులం అయినా తన వ్యక్తిగతం చెడగొట్టే పని చేస్తే ఊరుకోమని హెచ్చరించారు.

పాదయాత్ర ఎందుకు..?

జగ్గారెడ్డి రోజుకో పార్టీ మారుతున్నాడని ఆదివారం ప్రజాప్రస్థానం యాత్రలో భాగంగా ఆమె చేసిన వ్యాఖ్యలపై జగ్గారెడ్డి ఫైర్​ అయ్యారు. తాను ఏ పార్టీలో ఉంటే షర్మిలకు ఎందుకని, షర్మిల పాదయాత్ర చేస్తున్నది ప్రజా సమస్యలపై మాట్లాడేందుకా? లేక లీడర్లను తిట్టేందుకా? అని ప్రశ్నించారు. రాజశేఖర్ వదిలిన బాణాన్ని అని చెప్పుకుంటున్న షర్మిల ఆయన పేరును కరాబ్ చేస్తోందని, వైఎస్సార్ కూతురు కాబట్టి తిడితే మేము ఊరుకుంటామా? తమను విమర్శిస్తే వైఎస్సార్ కూతురు అని కూడా చూడబోమని, తాము కూడా విమర్శలు చేస్తామన్నారు. షర్మిల బీజేపీ, జగన్ కలిసి వదిలిన బాణం అని, ఏపీలోని సెటిలర్ల ఓటు బ్యాంక్ కాంగ్రెస్‌కు పోకుండా ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా డైరెక్షన్‌లో జగన్, షర్మిల పని చేస్తున్నారని ఆరోపించారు. అడ్డగోలుగా సంపాదించిన జగన్, షర్మిల తమ గుట్టు రట్టు కాకుండా బీజేపీ కంట్రోల్‌లో పని చేస్తున్నారని చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాకుండా బీజేపీ కనుసన్నల్లో జగన్, షర్మిల, విజయమ్మ బీజేపీ వ్యూహంలో పావులుగా మారారని అన్నారు. ఏపీలో సీఎం అయ్యే అవకాశం లేదు కాబట్టే షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టిందన్నారు. తెలంగాణలో ఉన్న నాలుగు ఎంపీ స్థానాలు కూడా బీజేపీ గెలవదని, పెట్రోల్, గ్యాస్ ధరలు పెంచుతుంటే జగన్, షర్మిల విమర్శించడం లేదన్నారు.

ALSO READ : ఇప్పుడు కాంగ్రెస్‌లో ఉన్నావు.. రేపు ఏ పార్టీలో ఉంటావో నీకే క్లారిటీ లేదు : వైఎస్‌ షర్మిల



Next Story

Most Viewed