పైపుల పర్సెంటేజీల కోసమే మిషన్ భగీరథ: సీఎల్పీ నేత భట్టి విక్రమార్క

by Disha Web Desk 11 |
పైపుల పర్సెంటేజీల కోసమే మిషన్ భగీరథ: సీఎల్పీ నేత భట్టి విక్రమార్క
X

దిశ ప్రతినిధి, నాగర్ కర్నూల్: తెలంగాణ పునర్నిర్మాణంలో భాగంగా బంగారు తెలంగాణగా మారుస్తామని చెప్పిన ముఖ్యమంత్రి వారి కుటుంబాన్ని, కాంట్రాక్టర్ల జీవితాలను బంగారమయం చేశారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పథకం పేద ప్రజల గొంతులు తడపడానికి కాదని కేవలం కాంట్రాక్టర్ల జేబులు నింపడానికి పైపుల పేరుతో పర్సంటేజీలు పొందడానికి ఈ పథకాన్ని రూపకల్పన చేశారని ఆయన ఆరోపించారు. శుక్రవారం పీపుల్స్ మార్చ్ 71 వ రోజు పాదయాత్ర సందర్భంగా నాగర్ కర్నూల్ జిల్లాలోని మరికల్ గ్రామంలో ఎంటర్ అయ్యారు. వారికి నాగర్ కర్నూల్ నియోజకవర్గ ఇంచార్జి మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం తిమ్మాజిపేట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు.

పాదయాత్ర సందర్భంగా గ్రామాలలో గత కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఇందిరమ్మ ఇల్లు తప్ప ఈ పదేళ్ల బిఆర్ఎస్ పాలనలో ఇండ్లు ఇవ్వలేక పోయిందన్నారు. ఇంటింటికి మంచినీళ్లు అందిస్తామని తీసుకువచ్చిన మిషన్ భగీరథ ప్రాజెక్టు ప్రచారం చేసుకోవడానికి మాత్రమే పనికొస్తుందన్నారు. పాదయాత్ర మొదలుపెట్టిన ఆదిలాబాద్ జిల్లా పిప్పిరి గ్రామం నుంచి నాగర్ కర్నూల్ వరకు ఏ గ్రామంలో చూసిన మిషన్ భగీరథ నీళ్లు అందలేదన్నారు. అనుమానం ఉన్నవాళ్లు పాదయాత్ర అనంతర తన వెంట వేస్తే చూపిస్తామన్నారు. గత ప్రభుత్వాలు తవ్వించిన బోరు బావులను సైతం వీటి పరిధిలోకి లాక్కొని ప్రజలకు స్వచ్చమైన తాగునీటిని అందించలేక పోతున్నారని మండిపడ్డారు. కేసీఆర్ తీసుకొచ్చిన ధరణితో బిఆర్ఎస్ పెద్దలకు గ్రామకంఠం భూములను దోచిపెడుతోందన్నారు.

సామాజిక అవసరాల కోసం ప్రతి గ్రామంలో కేటాయించిన 30% గ్రామకంఠం భూములను పార్ట్-బి లో పెట్టుకొని బిఆర్ఎస్ పెద్దలు వారికి కావాల్సిన వ్యక్తుల పేరిట ధరణిలో ఎక్కిస్తున్నారు ఆరోపించారు. దేశ విభజన సమయంలో పాకిస్తాన్ వెళ్లిన వారి భూముల సమాచారం సేకరించి పార్టీ బీలో పెట్టి హైదరాబాద్ చుట్టు ఉన్న విలువైన భూములను హాంఫట్ చేస్తున్నారని ఆరోపించారు. అర్బన్ ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ భూములను ప్లాట్లుగా చేసి రియల్ వ్యాపారం చేయడానికి భూములను ప్రభుత్వం బలవంతంగా గుంజుకుంటోందన్నారు. పాదయాత్రలో నిరుద్యోగులు ఎదురొచ్చి మా కోసం మాట్లాడండి అంటూ గోడు వెళ్ళబోసుకుంటున్నారని కొలువుల కొరకు కొట్లాడి స్వంత రాష్ట్రం తెచ్చుకుంటే ప్రస్తుతం కొలువులు రాక భయంతో స్వేచ్ఛను కోల్పోయి బతుకుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

చెంచుల జీవన ప్రమాణాలు పెంచడానికి నిజాం సమయంలో ఈ ప్రాంతంలో 1.40 లక్షల ఎకరాల భూములను కేటాయించగా వాటిపై ప్రభుత్వ పెద్దల కన్ను పడిందన్నారు. కేసీఆర్ చేసిన అభివృద్ధి చూసి మాట్లాడాలని బిఆర్ఎస్ నాయకులు చేస్తున్న ప్రకటనలు విడ్డూరంగా ఉన్నాయని టిపిసిసి ఉపాధ్యక్షులు మల్లు రవి అన్నారు. డబల్ బెడ్ రూమ్ ఇల్లు, దళితులకు మూడెకరాల భూమి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఏ ఒక్క పథకాన్ని అమలు చేయలేదన్నారు. వారి వెంట నాగర్ కర్నూల్ డిసిసి అధ్యక్షులు వంశీకృష్ణ డిసిసి ప్రధాన కార్యదర్శి అర్దమ్ రవి, తదితర ముఖ్య నేతలు కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు.


Next Story

Most Viewed