టీడీపీలో జాయినై 2 నెలలు దాటినా కన్నాకు ఇంకా ఏ పదవి దక్కలే..!

by Dishafeatures2 |
టీడీపీలో జాయినై 2 నెలలు దాటినా కన్నాకు ఇంకా ఏ పదవి దక్కలే..!
X

దిశ, ఏపీ బ్యూరో: బీజేపీ నుంచి టీడీపీలో చేరిన కన్నా లక్ష్మీ నారాయణ ఇటీవల ఎందుకో మౌన వ్రతం పాటిస్తున్నారు. పార్టీ కండువా వేసుకొని రెండు నెలలవుతోంది. చేరిన కొత్తలో కాస్త హడావుడి చేశారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని దాదాపు అన్ని నియోజకవర్గాలు పర్యటించారు. ప్రభుత్వంపై తనదైన శైలిలో విమర్శనాస్త్రాలు సంధించారు. ఆ తర్వాత ఎందుకో స్తబ్దుగా మారిపోయారు. రాష్ట్ర స్థాయిలో కాపు సామాజిక వర్గానికి చెందిన ఈ సీనియర్​ నేతకు టీడీపీలో ఇంకా ఎలాంటి బాధ్యతలు నిర్దేశించినట్లు లేదు. ఇలా ఖాళీగా ఉంచితే పార్టీకి ప్రయోజనమేంటని టీడీపీ శ్రేణుల నుంచి వినిపిస్తోంది.

మాజీమంత్రి కన్నా లక్ష్మీ నారాయణ ఓ చరిష్మా కలిగిన నేత. గుంటూరు పశ్చిమ, పెదకూరపాడు, సత్తెనపల్లిలో ఆయనకంటూ ప్రత్యేక అనుచర వర్గం ఉంది. ఆయా నియోజకవర్గాల్లో గెలుపోటములు ప్రభావితం చేయగలిగిన శక్తి సామర్థ్యాలున్నాయి. జిల్లాలో కాపు సామాజిక వర్గానికి అతీతంగా ఆయనకు ధీటైన నేతగా పేరుంది. అలాంటి నాయకుడికి చంద్రబాబు ఇప్పటిదాకా పార్టీలో ఎలాంటి పదవి కేటాయించలేదు. ఒకవేళ ఏదైనా నియోజకవర్గంలో పర్యటించినా ఆయన హోదా ఏంటనేది ముందుకొస్తుంది. దీంతో తొలుత కాస్త ఎక్కువగా పర్యటించినా తర్వాత వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది.

తెలుగు దేశం పార్టీకి కొన్ని నియోజకవర్గాల్లో ఇంకా తలనొప్పులు తగ్గలేదు. సత్తెనపల్లిలో కోడెల శివరాం, వైవీ ఆంజనేయులుతోపాటు మరికొందరు నేతల మధ్య సఖ్యత లేదు. తాటికొండలో మాజీ ఎమ్మెల్యే తాటికొండ శ్రావణ్​ కుమార్​కు కొందరు నేతలు సహకరించడం లేదు. ఇక్కడ నుంచి ఒకరికి నలుగురు సీటు ఆశిస్తున్నారు. ఎవరి పని వాళ్లదే అన్నట్లుంది. పొన్నూరులో కాపు సామాజిక వర్గాన్ని టీడీపీ వైపు మళ్లించడానికి చాలా కసరత్తు చేయాల్సి ఉంది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ చేపడుతున్న ‘ఇదేం ఖర్మ రాష్ట్రానికి’ కార్యక్రమం అన్ని నియోజకవర్గాల్లో విస్తృతంగా జరగడం లేదు. ఇంకా ఎప్పటికప్పుడు స్థానికంగా తలెత్తే సమస్యలపై స్పందన కూడా చాలా తక్కువగా ఉంది. ఇలాంటి తరుణంలో కన్నా లాంటి సీనియర్​ నేతల అనుభవాన్ని సరైన పద్దతిలో వినియోగించుకోవడంలో టీడీపీ వైఫల్యం కనిపిస్తోంది.

తాజాగా ‘జగనన్నకు చెబుదాం’అనే కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఉమ్మడి జిల్లాలో ప్రజల సమస్యలు బోలెడున్నాయి. ప్రధానంగా రెవెన్యూ, మున్సిపల్​, పోలీసు శాఖలకు సంబంధించిన గ్రీవెన్స్​ ఎక్కువగా ఉంటున్నాయి. కాస్త ప్రజల్లోకి చొచ్చుకుపోతున్న నాయకులు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై సీఎంకు ఫిర్యాదులు చేయించే పనిలో నిమగ్నమయ్యారు. నిత్యావసరాల ధరలు తగ్గింపు కోరుతూ సీఎంకు ఫిర్యాదులు చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలకు సరైన నష్ట పరిహారం చెల్లించాలని సీఎం దృష్టికి తీసుకెళ్లేందుకు రైతులను సమాయత్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయాలపై ఎప్పటికప్పుడు స్పందించే కన్నా లక్ష్మీ నారాయణలాంటి సీనియర్​ నేతకు రాష్ట్ర స్థాయి బాధ్యలు అప్పగిస్తే పార్టీ మరింత బలోపేతమవుతుందని టీడీపీ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. దీనిపై చంద్రబాబు ఆలోచించాలని తమ్ముళ్లు కోరుకుంటున్నారు.

Also Read..

పాదయాత్రలో సమస్యలు గమనించే పథకాల రూపకల్పన : జగన్

యువగళం.. రణగళం



Next Story

Most Viewed