తెలుగులోనూ పరీక్ష రాసే అవకాశం కల్పించాలి.. అమిత్ షాకు కేటీఆర్ లేఖ

by Disha Web Desk 2 |
తెలుగులోనూ పరీక్ష రాసే అవకాశం కల్పించాలి.. అమిత్ షాకు కేటీఆర్ లేఖ
X

దిశ, తెలంగాణ బ్యూరో: సీఆర్పీఎఫ్ ఉద్యోగాల కోసం కేవలం హిందీ, ఇంగ్లీష్ మాధ్యమంలో మాత్రమే పోటీ పరీక్షలు నిర్వహిస్తున్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సమీక్షించుకోవాలని మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. శుక్రవారం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. ఈ పరీక్షను తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళంతో పాటు గుర్తించబడిన అన్ని అధికారిక భాషల్లో నిర్వహించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. కేవలం హిందీ మరియు ఇంగ్లీష్ భాషల్లో మాత్రమే ఈ పోటీ పరీక్షలను నిర్వహించడం వలన నిరుద్యోగ యువకులకు తీవ్రమైన అన్యాయం జరుగుతుందన్నారు.

ఇప్పటికే వివిధ ఉద్యోగాల కోసం అనేక పరీక్షలు నిర్వహించే బదులు, నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ ద్వారా కామన్ ఎలిజిబిటీ టెస్ట్ విధానంలో 12 అధికారిక భాషల్లో పరీక్ష నిర్వహించేందుకు కేంద్రం గతంలో తీసుకున్న విషయాన్ని లేఖలో గుర్తు చేశారు. అనేక అధికారిక భాషలు కలిగిన దేశంలో, కేవలం హిందీ వారికి మాత్రమే మాతృభాషలో పోటీ పరీక్షలు రాసే అవకాశం ఇవ్వడమంటే దేశ రాజ్యాంగ స్పూర్తికి పూర్తిగా విరుద్ధమన్నారు. దేశంలో రాజ భాష అంటూ ఏదీ లేదని రాజ్యాంగం స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వం ప్రాంతీయ భాషలను పట్టించుకోకుండా కేవలం హిందీ, ఆంగ్ల మాధ్యమాల్లో ఉద్యోగాల భర్తీ పరీక్షలు నిర్వహించడం రాజ్యాంగ విరుద్ధమన్నారు.

సమాన అవకాశాలు పొందేలా ఈ దేశ ప్రజలకు రాజ్యాంగం ఇచ్చిన హక్కుని సీఆర్పీఎఫ్ నోటిఫికేషన్ కాలరాస్తుందని తెలిపారు. గంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ పరీక్షలన్నింటిని అన్ని గుర్తించబడిన అధికారిక ప్రాంతీయ భాషల్లోనూ నిర్వహించాలని 2020 నవంబర్ 18న కేంద్రానికి సీఎం కేసీఆర్ లేఖ కూడా రాశారని పేర్కొన్నారు. ప్రాంతీయ భాషల్లో చదువుతున్న కోట్లాది యువకులకు ఎలాంటి వివక్ష, అసమానతలు లేకుండా సమాన అవకాశాలు దక్కేలా సీఆర్పీఎఫ్ నోటిఫికేషన్ కు సవరణ చేయాలని అమిత్ షాకు విజ్ఞప్తి చేశారు.



Next Story

Most Viewed