కేసీఆర్ బీజేపీతో చేసుకున్న చీకటి ఒప్పందం బెడిసికొట్టింది: మల్లు రవి, నాగం జనార్దన్ రెడ్డి

by Disha Web Desk 11 |
కేసీఆర్ బీజేపీతో చేసుకున్న చీకటి ఒప్పందం బెడిసికొట్టింది: మల్లు రవి, నాగం జనార్దన్ రెడ్డి
X

దిశ ప్రతినిధి, నాగర్ కర్నూల్: బీజేపీతో పోరాడేది మేమే అంటూనే థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తున్నట్లు గొప్పలు చెప్పుకున్న సీఎం కేసీఆర్ కర్ణాటక ఎన్నికల్లో పోటీలో నిలబడకుండా చివరికి బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు అనుకూలంగా జేడీఎస్ నేతలకు హైదరాబాద్ కేంద్రంగా పెద్ద పెద్ద హోటళ్లలో షెల్టర్ ఏర్పాటు చేశారని టీపీసీసీ ఉపాధ్యక్షులు మాజీ ఎంపీ మల్లురవి, మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డిలు ఆరోపించారు. శనివారం నాగం స్వగృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కర్ణాటక ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ విజయం సాధించడం పట్ల మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

కుల, మత ప్రాంతాల వారిగా ప్రజల్లో ఓట్లు రాల్చుకోవడం కోసం భయభ్రాంతులకు గురిచేసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న తీరుకు కర్ణాటక ప్రజలు గట్టి సమాధానమే చెప్పారని అన్నారు. బీజేపీ అధికార మదంతో గెలిచిన ఎమ్మెల్యేలను కూడా కొనుగోలు చేస్తుందన్న ఉద్దేశంతో కర్ణాటక ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమయ్యే స్పష్టమైన మెజారిటీ ఎమ్మెల్యేలను గెలిపించారని చెప్పారు. ఒకవేళ హంగు ఏర్పడితే జేడీఎస్ నేతలతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెరవెనక చీకటి ఒప్పందాన్ని చేసుకున్నట్లు కర్ణాటక ప్రజలు స్పష్టమైన మెజారిటీ ఇవ్వడంతో ఆ చీకటి ఒప్పందం బెడిసి కొట్టిందన్నారు.

కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రెండు అవినీతి అక్రమాల్లో కూరుకుపోయాయని తెలంగాణ రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లోను కాంగ్రెస్ పార్టీకి 100కు పైగా సీట్లు సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలు నచ్చని బడాబడా లీడర్లంతా కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారని మరికొద్ది రోజుల్లో భారీ ఎత్తున కాంగ్రెస్ పార్టీలోకి వలసలు వరదలా రానున్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు. వారి వెంట డీసీసీ ప్రధాన కార్యదర్శి అర్థం రవి, మాజీ ఎంపీపీ కోటయ్య, కాంగ్రెస్ నేతలు నారాయణ, గబ్బి రాజశేఖర్, మల్లయ్య తదితరులు ఉన్నారు.



Next Story

Most Viewed