చంద్రబాబుపై రాళ్ల దాడి ప్లాన్ జగన్ రెడ్డి, ఐ-ప్యాక్‌దే?

by samatah |
చంద్రబాబుపై రాళ్ల దాడి ప్లాన్ జగన్ రెడ్డి, ఐ-ప్యాక్‌దే?
X

దిశ, డైనమిక్ బ్యూరో : ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కుట్రలో భాగంగానే ఎర్రగొండపాలెంలో టీడీపీ అధినేత చంద్రబాబుపై రాళ్ల దాడి జరిగిందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. చంద్రబాబు పర్యటనలపై వైసీపీ నేతలు కుట్రలు చేస్తున్నారని.. దాడులకు పాల్పడే అవకాశం ఉందని తాము ముందుగానే భావించినట్లు తెలిపారు. ఇందులో భాగంగానే కడప, ప్రకాశం, పల్నాడు జిల్లాల ఎస్పీలకు, డీజీపీలకు లేఖ రాసినట్లు తెలిపారు. అంతేకాదు పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ఫోన్‌లో డీజీపీకి సైతం ఫిర్యాదు చేశారు అని వెల్లడించారు. అయినా దాడి జరిగిందంటే అది ముమ్మాటికీ పోలీసులు, అధికార పార్టీ నేతలు కలిసి చేసిన కుట్రే.. ప్రతిపక్ష నేతకు భద్రత కల్పించడంలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం జగన్ రెడ్డి కుట్రలో భాగమేనని అచ్చెన్నాయుడు ఆరోపించారు. ఎన్ఎస్‌జీ కమాండోలపై కూడా రాళ్ల దాడికి దిగి, వారిని రెచ్చగొట్టి దళితులపై కాల్పులు జరిపేలా చేసి, తద్వారా తెలుగుదేశం పార్టీపై బురద జల్లేందుకు కుట్ర చేశారు అని ఆరోపించారు.

జగన్ రెడ్డి రోడ్డెక్కితే పరదాలు కట్టి, కందకాలు తవ్వి, రోడ్లపై బారికేడ్లు పెట్టి ప్రజల్ని కూడా రోడ్డెక్కనివ్వకుండా, ప్రతిపక్ష నేతల్ని గృహ నిర్బంధాలు చేసే పోలీసులు.. రౌడీ మూకలు దాడి చేయడానికి వస్తుంటే అడ్డుకోకుండా వారికి అండగా నిలవడం వెనుక జగన్ రెడ్డి ఆదేశాలున్నాయి అని అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. చంద్రబాబు కాన్వాయ్ ఎటు నుండి వస్తుందో మంత్రి ఆదిమూలపు సురేశ్ పోలీసులను కనుక్కుంటున్న తీరు చూస్తుంటే దాడికి ముందుగానే ప్లాన్ చేసుకున్నారని అర్ధమవుతోంది అని స్పష్టం చేశారు. మంత్రిగా ఉన్న వ్యక్తి వీధి రౌడీలా చొక్కా విప్పి రోడ్డుపై హల్‌చల్ చేయడం దుర్మార్గమన్నారు. జెడ్ ప్లస్ సెక్యూరిటీ కలిగిన ప్రతిపక్ష నాయకుడి పర్యటనకు భద్రత కల్పించాల్సింది పోయి.. ఆదేశానుసారం దాడులు చేసే వారికి రెడ్ కార్పెట్ వేయడం ప్రజాస్వామ్యాన్ని హరించడమేనని అచ్చెన్నాయుడు అభిప్రాయపడ్డారు. వైఎస్ వివేకా హత్య కేసు, కోడికత్తి కేసుల్లో జగన్ రెడ్డి మెడకు ఉచ్చు బిగుసుకుంటోందని..ఆ ఫ్రష్ట్రేషన్‌తో ఏం చేయాలో దిక్కు తోచని స్థితిలో ఇలా ప్రతిపక్ష నాయకుడిపై రౌడీ మూకలతో దాడులు చేయిస్తున్నారు అని ధ్వజమెత్తారు. ఈ దాడి వెనుక జగన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, ఐ-ప్యాక్ కుట్ర ఉంది అని ఆరోపించారు. కుట్ర, దాడి, పోలీసు వైఫల్యాలపై గవర్నర్ తక్షణమే చర్యలు తీసుకోవాలి అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు.

Next Story