కేసీఆర్.. తెలంగాణ అస్తిత్వానికి ప్రమాదం.. వెల్లడించిన ఇందిరాశోభన్

by Dishafeatures2 |
కేసీఆర్.. తెలంగాణ అస్తిత్వానికి ప్రమాదం.. వెల్లడించిన ఇందిరాశోభన్
X

దిశ, తెలంగాణ బ్యూరో : ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ అస్తిత్వానికి ప్రమాదకరంగా మారారని ఇందిరాశోభన్ వ్యాఖ్యానించారు. అమరుల త్యాగాల వల్ల ఏర్పడిన రాష్ట్రంలో వారి ఆత్మలు శోకిస్తున్నాయని, అందుకే రాష్ట్ర అస్తిత్వాన్ని కాపాడుకునేందుకు తెలంగాన ఆత్మగౌరవ యాత్ర పేరిట పాదయాత్రను ప్రారంభిస్తున్నట్లు ఆమె శనివారం స్పష్టంచేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే నీళ్లు, నిధులు, నియమాకాలన్నీ ఇక్కడి ప్రాంత ప్రజలకే దక్కుతాయని ఆశించి మలిదశ ఉద్యమంలో 1240 మంది యువకులు అసువులుబాశారని ఆమె ఆవేదన వ్యక్తంచేశారు. కానీ నేడు వారి త్యాగాలకు, ఆత్మగౌరవానికి గుర్తింపు లేకుండాపోయిందని ధ్వజమెత్తారు. అమరుల త్యాగాలతో ఏర్పడిన తెలంగాణలో అమరవీరుల స్తూపాన్ని ఆవిష్కరించాలన్న చిత్తశుద్ధి కేసీఆర్ కు లేకుండా పోయిందని విమర్శలు చేశారు. స్వరాష్ట్రంలో జై తెలంగాణ అని నినదిస్తే సీఎం కేసీఆర్ నేరంగా భావిస్తున్నారన్నారని ఆమె విమర్శలు చేశారు.

రాష్ట్రం కోసం త్యాగం చేసిన అమరవీరుల కుటుంబాలకు రూ.10 లక్షల నగదు, డబుల్ బెడ్రూం ఇల్లు, ఉద్యోగం ఇస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారని, నేడు అధికారంలోకి వచ్చాక అవన్నీ మరిచారన్నారు. మిగులు బడ్జెట్ లో ఉన్న రాష్ట్రాన్ని రూ.5 లక్షల కోట్ల అప్పులకు తీసుకెళ్లారని ఆరోపించారు. ఇంత అప్పు చేసిన కేసీఆర్ ఒక్క అమరుడి కుటుంబానికైనా సాయం చేశారా అని ఆమె ప్రశ్నించారు. నాడు తెలంగాణ యాసను, భాషను అవమానిస్తున్నారని, వక్రీకరిస్తున్నారని ఇతరులపై కేసీఆర్ విమర్శలు చేశారని, మరి వాటి పరిరక్షణకు కేసీఆర్ చేసిందేంటని ఇందిరాశోభన్ ప్రశ్నించారు. తెలంగాణ సొమ్ముతో ఇతర రాష్ట్రాల నేతలను ఆహ్వానించి అప్పనంగా కోట్లు ఖర్చు చేస్తున్నారని ఆమె ధ్వజమెత్తారు. తెలంగాణ అస్తిత్వాన్ని, ఆత్మాభిమానాన్ని అమరుల ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు మార్చి మొదటివారంలో 'తెలంగాణ ఆత్మగౌరవ యాత్ర'ను చేపడుతున్నట్లు ఇందిరాశోభన్ స్పష్టంచేశారు. కాగా ఈనెల 28వ తేదీన తేదీని ప్రకటిస్తానని ఆమె స్పష్టంచేశారు.

ఈ పాదయాత్రలో భాగంగా తెలంగాణ కోసం అసువులు బాసిన అమరవీరుల కుటుంబాలను పరిశీలించి వారి స్థితిగతులు తెలుసుకొని తెలంగాణ సమాజానికి తెలియజేస్తామని ఆమె తెలిపారు. అలాగే తెలంగాణకు అర్థం, పరమార్థం లేకుండా చేస్తున్న సీఎం కుటిల నీతిని కూడా ప్రజలకు తెలియజేస్తామని పేర్కొన్నారు. ఈ యాత్రలో కవులు, కళాకారులు జర్నలిస్టులు, విద్యార్థులు, యువత, సబ్బండ వర్గాలందరూ పాల్గొని సంఘీభావం తెలపాలని ఇందిరాశోభన్ కోరారు. తెలంగాణ ప్రజలంటే ఆత్మాభిమానాన్ని వదులుకునే వారు కాదనే విషయాన్ని కేసీఆర్ కు అర్థమయ్యేలా ఈ యాత్ర ద్వారా చెబుతామని తెలిపారు. తెలంగాణ అస్తిత్వాన్ని లేకుండా చేయాలని చూస్తున్న వారిని తరిమికొడుతానని, ఇందుకు అందరూ తరలిరావాలని ఇందిరాశోభన్ విజ్ఞప్తిచేశారు.



Next Story