పార్టీ మారే ఆలోచన లేదు.. మాజీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి

by Dishafeatures2 |
పార్టీ మారే ఆలోచన లేదు.. మాజీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో : తాను పార్టీ మారుతున్నట్లు పలువురు దుష్ప్రచారం చేస్తున్నారని, ఆరు నెలల నుంచి తన పని తాను చేసుకుంటున్నానని మాజీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఢిల్లీలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. మునుగోడు ఉప ఎన్నికల తర్వాత కాంగ్రెస్ లో చేరుతానని తాను ఎక్కడా అనలేదన్నారు. తనపై కొంతమంది కావాలని ఎందుకు దుష్ప్రచారం చేస్తున్నారో తెలియడం లేదన్నారు. తనకు సోనియాగాంధీ, రాహుల్ గాంధీపై అభిమానం ఉందని, అంతేకాని బీజేపీని వీడి కాంగ్రెస్ కు వెళ్లబోనని పేర్కొన్నారు. పార్టీకి, పదవికి రాజీనామా చేసి ప్రజల సమక్షంలో బీజేపీలో చేరినట్లు ఆయన గుర్తుచేశారు. తనను రాజకీయంగా ఎదుర్కోలేక బీఆర్ఎస్ నేతలు, రేవంత్ రెడ్డి విపరీతమైన కుతంత్రాలు చేశారని విమర్శలు చేశారు. సీఎం కేసీఆర్ అవినీతి డబ్బుతో మునుగోడు ఉప ఎన్నికల్లో గెలిచారని ఆయన ధ్వజమెత్తారు. మునుగోడులో నైతిక విజయం తనదేనని అందరికీ తెలుసన్నారు.

సమాచార హక్కు చట్టాన్ని వాడుకుని రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిల్ చేస్తాడని రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో కుటుంబ, నియంత పాలన పోవాలని ప్రజల కోసం తాము ప్రభుత్వంపై పోరాడుతున్నట్లు వెల్లడించారు. కర్ణాటక ఎన్నికల తర్వాత కాంగ్రెస్ కు చెందిన పలువురు తిరిగి వచ్చేయాలని అడిగారని, కానీ తాను వెళ్లబోనని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఓడించాలంటే బీజేపీ వల్లే సాధ్యమన్నారు. కాంగ్రెస్ లో ఎవరు ఏంటనేది వారికి కూడా తెలియదని, అందరూ పాదయాత్రలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. డబ్బు కోసం పార్టీలు మారాల్సిన అవసరం తనకు లేదని గుర్తుచేశారు. తనకు వచ్చిన టెండర్ చాలా పారదర్శకమైన ప్రక్రియ ద్వారానే వచ్చిందని రాజగోపాల్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఇక బండి సంజయ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా మూడేండ్ల నుంచి కొనసాగుతున్నారని, కేంద్ర నాయకత్వం అనుకుంటే అతడినే మళ్లీ కొనసాగిస్తారని పేర్కొన్నారు.



Next Story