ముహూర్తం ఫిక్స్.. పార్టీ శ్రేణులకు కేసీఆర్ కీలక ఆదేశాలు

by Disha Web Desk |
CM KCR Likely to Visit Bihar On August 13
X

దిశ, తెలంగాణ బ్యూరో : మీటింగ్‌కు అందరూ హాజరుకావాలి... ఎవరూ మిస్ కావొద్దని పార్టీ కార్యవర్గ సభ్యులతో పాటు జిల్లా అధ్యక్షులు, కేబినెట్, ఎంపీలు, ఎమ్మెల్సీలకు పార్టీ అధిష్టానం మెసేజ్ ఇచ్చింది. అక్టోబర్ 5న తెలంగాణలో నిర్వహించే సమావేశానికి విధిగా హాజరుకావాలని ఆదేశించినట్లు సమాచారం. ఈ సమావేశంలో జాతీయపార్టీపై క్లారిటీని కేసీఆర్ ఇవ్వనున్నారు. అదే విధంగా పార్టీ యూనిట్ల నుంచి తీర్మానం చేయనున్నారు.

దేశ రాజకీయాల్లోకి అక్టోబర్ 5న గ్రాండ్‌ ఎంట్రీని కేసీఆర్ ఇవ్వనున్నారు. అందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను ఇప్పటికే పూర్తి చేశారు. ఆ రోజు దసరా పండుగ కావడంతో తెలంగాణ భవన్‌లో టీఆర్ఎస్ పార్టీ కార్యవర్గ సమావేశాన్ని ఉదయం 11 గంటలకు నిర్వహిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ సమావేశానికి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లతో పాటు పార్టీ జిల్లా, రాష్ట్ర కార్యవర్గ సభ్యులంతా హాజరు కావాలని పార్టీ అధిష్టానం మెసేజ్ ఇచ్చినట్లు సమాచారం. దీంతో అందరూ ఆ రోజు కార్యక్రమాలను రద్దు చేసుకుంటున్నట్లున్నారు. అదే విధంగా టీఆర్ఎస్ఎల్పీ మీటింగ్‌ను కూడా ఫార్మాలిటీగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆ సమావేశాల్లో అందరికీ ఉద్దేశాలను కేసీఆర్‌ వివరించిన అనంతరం మధ్యాహ్నం 1:19 గంటలకు జాతీయ పార్టీ ప్రకటన ఉంటుందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.

అన్ని యూనిట్ల నుంచి తీర్మానం...

టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కమిటీతో పాటు అనుబంధ కమిటీల నుంచి కూడా మరోసారి తీర్మానం చేయించనున్నట్లు తెలిసింది. కొత్తపార్టీని ప్రకటిస్తే ఆ పార్టీలో టీఆర్ఎస్ విలీనం చేస్తున్నట్లు తీర్మానం కూడా చేసేలా తీర్మానం చేయిస్తారని ఓ సీనియర్ నాయకుడు పేర్కొన్నారు. చేసిన తీర్మాన ప్రతులను కేంద్ర ఎన్నికల సంఘానికి అందజేయనున్నారు.

చార్టెడ్ ప్లైట్ కొనుగోలు?

టీఆర్‌ఎస్ పార్టీ త్వరలోనే చార్టెడ్‌ ఫ్లైట్‌ కొనుగోలు చేయనుందనే ప్రచారం జరుగుతోంది. అక్టోబర్‌ 5న జాతీయ పార్టీ ప్రకటన తర్వాత ఆర్డర్‌ చేయనున్నట్లు సమాచారం. దేశవ్యాప్తంగా పర్యటనల కోసమే ఫ్లైట్ ను రూ.80 కోట్లతో 12 సీట్ల సామర్థ్యం ఉన్నది కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. టీఆర్ఎస్‌ పార్టీ ఖాతాలో ఇప్పటికే రూ.865 కోట్ల ఫండ్స్‌ ఉన్నట్లు గతంలో సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఫ్లైట్‌ కోసం మొత్తాన్ని విరాళాల ద్వారా నిధులను సమీకరించాలని పార్టీ భావిస్తున్నట్లు సమాచారం.

Next Story

Most Viewed