AP Politics: నకిలీకి సీటు.. గిరిజనులపై బహిష్కరణ వేటు

by Disha Web Desk 3 |
AP Politics: నకిలీకి సీటు.. గిరిజనులపై బహిష్కరణ వేటు
X

దిశ ప్రతినిధి, విశాఖపట్నం: ఊరందరిదీ ఒక దారి అయితే ఉలిపికట్టెది మరో దారన్నట్టుంది ఏపీ బీజేపీ పరిస్థితి. ఎన్నికల సమయంలో మిగిలిన పార్టీలన్నీ నేతలపై గతంలో చేసిన సస్సెన్షన్‌లను తొలగించి, బుజ్జగించి అందరినీ కలుపుకుంటూ పోతుంటే.. బీజేపీ మాత్రం బయట నుంచి వచ్చి, రాత్రికి రాత్రి టికెట్ సంపాదించిన అభ్యర్థి కోసం ఎప్పటి నుంచో ఉన్న సీనియర్ నేతలను సస్పెండ్ చేసి తామున్న చెట్టుకొమ్మనే నరుక్కొంటుంది.

గత ఎన్నికలలో విశాఖ ఎంపీగా పోటీ చేసి వేయి ఓట్లు మాత్రమే తెచ్చుకొన్న గిరిజనేతర వర్గానికి చెందిన కొత్తపల్లి గీతకు అరకు ఎంపీ టికెట్ ఇవ్వవద్దని, ఆమె కులంపై వివాదం ఉందని చెప్పిన పాపానికి ఆమె కంటే ముందు నుంచే పార్టీలో వుండి ఎన్నో సేవలందించిన ఇద్దరు మాజీ శాసనసభ్యులు నిమ్మక జయరాజ్, కెవివి సత్యనారాయణ రెడ్డితో పాటు సీనియర్ నేత హేమనాయక్‌ల సభ్యత్వాలను క్రమశిక్షణ ఉల్లంఘన క్రింద రద్దు చేస్తున్నట్లు పార్టీ అరకు పార్లమెంటు ఇన్చార్జి పరుశరామరాజు ప్రకటించారు.

పార్వతీపురానికి చెందిన నిమ్మక జయరాజు, రంపచోడవరానికి చెందిన కెవివి సత్యనారాయణ రెడ్డిలు బలమైన గిరిజన నాయకులు. హేమనాయక్‌కు తన వర్గంలో మంచి పట్టే వుంది. ఎన్నికల సమయంలో వీరిని సంప్రదించి, బుజ్జగించి సర్దుబాటు చేయకుండా ఏకంగా పార్టీలోనుంచి తొలగించడం పట్ల క్యాడర్‌లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమౌతుంది.

కొత్తపల్లి గీతను నకిలీ గిరిజనురాలుగా ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం 2024 జనవరిలోనే జీవో జారీ చేసింది. దానిపై ఆమె కోర్టు నుంచి తాత్కాలిక స్టే తెచ్చుకొన్నారు. అలానే ఆమెపై బ్యాంక్‌ను మోసం చేసిన కేసు పెండింగ్‌లో వుంది. ఆమెకు టికెట్ ఇచ్చి నిజమైన గిరిజనులను, ఆది గిరిజనులను పార్టీనుంచి తొలగించడమేమిటని సాటి బీజేపీ నేతలే ప్రశ్నిస్తున్నారు.

కొత్తపల్లి గీత కోసం పార్టీ అధ్యక్షురాలు పురందేశ్వరి పార్టీని నాశనం చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఎన్నికల సమయంలో అందరినీ దగ్గరకు తీసుకోవడం మానేసి ఇలా తొలగిస్తూ పోతే ఉన్న ఓట్లు కూడా రావన్న వాస్తవం గ్రహించకపోతే ఎలా? అని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే కొత్తపల్లి గీతకు మిత్ర పక్షాలనుంచి సహకారం లేక ఒంటరిగా ప్రచారం చేసుకొంటున్నారు. ఇప్పుడు బీజేపీ వారిని కూడా దూరం చేసుకొని ఏం సాధిస్తారో? చూడాలి అని ఆ పార్టీ నేతలే అనడం గమనార్హం.

Next Story

Most Viewed